‘సూపర్ 30’ ఆనంద్కు అరుదైన ఆహ్వానం
కరోనా వైరస్ రోజురోజుకు ప్రపంచమంతా విస్తరిస్తూ ఉంది. అమెరికా అయితే కరోనా దెబ్బకు చిగురుటాకులా వణికిపోతూ ఉంది. ఇప్పటికే ఆ దేశంలో 80వేల మంది చనిపోయారు. ఇటువంటి సమయంలో బిహార్కు చెందిన ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్కు అమెరికాలోని బెర్కలీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి అరుదైన ఆహ్వానం లభించింది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తమ విద్యార్థులకు సందేశం ఇవ్వాలని, వారిలో ఉత్తేజాన్ని తిరిగి నింపాలని వర్సిటీ ఆయనను కోరింది. విద్యార్థుల మనోధైర్యాన్ని పెంచేందుకు సూపర్ 30 వ్యవస్థాపకుడు మరియు గణిత శాస్త్రజ్ఞుడు అయిన ఆనంద్ కుమార్ను వర్చువల్ సెషన్ నిర్వహించాలని కోరింది.
అమెరికాలో ఇప్పటివరకు 80,000 మందిని కరోనావైరస్ మహమ్మారి మింగేయగా.. లక్షలాది మందికి కరోనా సోకింది. ఈ ప్రభావం విద్యా వ్యవస్థపై కూడా పడింది. దీంతో ఒత్తిడిలో ఉన్న విద్యార్థుల్లో తిరిగి ఆత్మ విశ్వాసం నింపడానికి బెర్కలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఆనంద్ కుమార్ను ఆహ్వానించింది.
మే 16న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించాలని బెర్కలీ ఇండియా ప్రతినిధి శుభం పరేఖ్ ఆనంద్ కుమార్ను కోరారు. భారత్లో విద్యారంగంలో ఆనంద్ కుమార్ పాత్రను ఆయన కొనియాడారు. బెర్కలీ కాలిఫోర్నియా వర్సిటీ విద్యార్థులకు విలువైన సూచనలు ఇవ్వాలని ఆనంద్ను కోరుతున్నట్లు శుభం పరేఖ్ వెల్లడించారు.
“భారతదేశంలో ప్రభుత్వ విద్యావ్యవస్థ భయంకరమైన పరిస్థితిని చూసిన వ్యక్తిగా, విద్య ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మీ సహకారం ప్రాముఖ్యతను నేను గ్రహించాను. విద్యారంగంలో మీ కృషికి అవార్డు లభించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందున్న మీరు బర్కిలీ విద్యార్థులు మీ అమూల్యమైన సలహాలను పొందాలని మేము కోరుకుంటున్నాము” అని కుమార్కు కాలిఫోర్నియా యూనివర్శిటీ ఇచ్చిన ఆహ్వానంలో ఉంది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించడానికి ఆనంద్ కుమార్ కూడా అంగీకరించారు. ప్రస్తుతం మానవాళి ఎందుర్కొంటున్న విపత్కర పరిస్థితుల్లో సానుకూల దృక్ఫథంతో ఉండాల్సిన అవసరం ఉందని కుమార్ చెప్పారు. తన విద్యార్థుల విజయగాథలను కాలిఫోర్నియా బెర్కలీ విద్యార్థులను చెబుతానని చెప్పారు. ‘సంక్షోభంలో అవకాశాలు’ అనే అంశంపై ఆయన ప్రసంగం చెయ్యనున్నారు.
Read More: