బ్రేకింగ్ : నూతన వ్యవసాయ చట్టాలపై స్టే ఇచ్చిన సుప్రీం కోర్ట్, రైతులతో చర్చల కోసం కమిటీ
Supreme Court stays implementation of farm laws until further notice : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీం కోర్ట్ స్టే విధించింది. ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. నిరసన తెలుపుతున్న రైతులపై చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తాము ఏర్పాటు చేయబోయే కమిటీకి రైతులు సహకరించాలని…… అన్ని రైతు సంఘాల నుంచి కమిటీ అభిప్రాయాలను సేకరించాలని చీఫ్ జస్టిస్ బోబ్డే తెలిపారు. న్యాయ ప్రక్రియ పట్ల రైతు సంఘాలు విశ్వసనీయత చూపాలని…..ఈ సమస్యను పరిష్కరించడమే తమ ఉద్దేశం అని చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించారు.
భూపేందర్ సింగ్ మాన్(బీకేయూ), ప్రమోద్ కుమార్ జోషి(ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), అశోక్ గులాటీ(వ్యవసాయ శాస్త్రవేత్త), అనిల్ ఘావంత్(షెట్కారీ సంఘటన) లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్నతీరుపై సోమవారం సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇందుకోసం అవసరమైతే స్టే విధిస్తామని చెప్పిన సుప్రీం కోర్టు మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.
అదే విధంగా కమిటీని నియమించే అధికారం తమకు ఉందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా.. ‘‘అందరి కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. మాకు నివేదిక సమర్పించేందుకే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. రైతు సంఘాలు సహకరించాలి. సమస్య పరిష్కారం కోసం ఇరుపక్షాలు కమిటీని సంప్రదించాలి. రైతులు నేరుగా కానీ, లేదా తమ న్యాయవాదుల ద్వారా కమిటీకి సమస్యలు వివరించవచ్చని తెలిపింది. కమిటీని నియమించడంతో పాటుగా.. చట్టాలను నిలిపివేసే అధికారం కూడా మాకు ఉంది. అయితే ఇప్పుడు స్టే విధించామే తప్ప…. చట్టాలను నిరవధికంగా నిలిపివేయబోవటం లేదు. మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాం. ఒకవేళ రైతు సంఘాలు కమిటీకి సహకరించకపోతే….. ప్రధానిని ఏదైనా చెయ్యమని మేం అడగలేం కదా’’ అని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది.
వ్యవసాయ చట్టాల అంశంపై విచారణ జరిగిన సమయంలో పిటీషనర్ల తరపున ఎంఎల్ శర్మ మాట్లాడారు. ప్రధాని మోదీ రైతులను ఒకేసారి కలిసినట్లు ఆయన తెలిపారు. అయితే రైతులు కమిటీ ముందుకు వచ్చేందుకు సిధ్దంగా లేరని ఆయన సుప్రీం కోర్టుకు తెలిపారు. ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళినప్పుడు కమిటీ ముందుకు వస్తే తప్పేంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సమస్య పరిష్కారం కావాలి అనుకుంటే కమిటీ ముందు హాజరై అభిప్రాయం చెప్పాల్సిందేనని తేల్చి చెప్పింది. సమస్య పరిష్కారం కాకుండా ఆందోళన చేయాల్సి వస్తే అది నిరవధికంగా కొనసాగుతుందని ధర్మాసనం అభిప్రాయ పడింది.
అయితే ఈ విషయంలో తాము ప్రధానికి ఎటువంటి దిశానిర్దేశం చేయలేమని సీజే న్నారు. రైతు సంఘాలతో ఇద్దరు కేంద్ర మంత్రులు చర్చించినట్లు సొలిసిటర్ జనరల్ హారీశ్ సాల్వే తెలిపారు. ప్రస్తుతానికి వ్యవసాయ చట్టాలను సస్పెండ్ చేస్తున్నామని, కానీ శాశ్వతంగా ఆ చట్టాలను సస్పెండ్ చేయలేమని సీజే తెలిపారు. కమిటీ ఏర్పాటు ప్రక్రియను సాల్వే స్వాగతించారు. రాజకీయ లబ్ది కోసం న్యాయ విధానం సాగవద్దన్నారు. కేవలం ఉద్రిక్తతను తగ్గించేందుకు, ఉత్సాహాన్ని నింపేందుకు చట్టాలపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు హరీశ్ సాల్వే తెలిపారు. తదుపరి ఆదేశాల వచ్చే వరకు సాగు చట్టాలపై స్టే కొనసాగుతుందని సుప్రీం పేర్కొన్నది. వ్యవసాయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.