టీడీపీ దూకుడు.. ప్రజల్లోకి చంద్రబాబు

టీడీపీ దూకుడు.. ప్రజల్లోకి చంద్రబాబు

Chandrababu:ఏపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది తెలుగుదేశం పార్టీ. ఈ క్రమంలోనే నేటి(04 మార్చి 2021) నుంచి ప్రచార బరిలోకి దిగుతోన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. టీడీపీ ప్రచార బాధ్యతలను భుజానికి ఎత్తుకున్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో ప్రచారం నిర్వహించనున్నారు. అందుకోసం ఇవాళ కర్నూలుకు వెళ్తోన్న చంద్రబాబు.. కార్పొరేషన్‌ పరిధిలో ప్రచారం చేయనున్నారు.

మధ్యాహ్నం 2 గంటల 30నిమిషాలకు పంచలింగాల టోల్‌గేట్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి పెద్దమార్కెట్‌ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మండపం దగ్గరకు చేరుకుంటారు. పాతబస్టాండు, గోశా హాస్పిటల్‌, స్టేట్‌ బ్యాంక్‌ మీదుగా బంగారు పేట, కొత్తబస్టాండు, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. రోడ్‌షోలో చంద్రబాబు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలతో మాట్లాడనున్నారు.

చెన్నమ్మసర్కిల్‌ వద్ద చైతన్య రథం నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. టీడీపీని గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించనున్నారు. ఇక కర్నూలు పర్యటన తర్వాత విజయవాడ, గుంటూరు, విశాఖలో జరిగే రోడ్డు షోలలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు.