టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ వార్

టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ వార్

Telangana BJP Stratagy in MLC, Bye-poll Elections : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్‌గా బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడాలని భావిస్తోంది. ఇందుకోసం పక్కా ప్లాన్‌ను రూపొందిస్తోంది. దుబ్బాక, గ్రేటర్‌ హైదరాబాద్ లో వచ్చిన రిజల్ట్స్‌ను ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌ యాత్రకు శ్రీకారం చుట్టింది. నిన్న నిజామాబాద్‌లో సాగిన తరుణ్‌చుగ్‌ యాత్ర.. ఇవాళ ఖమ్మంలో కంటిన్యూ కానుంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. 2024లో జరిగే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బలపడేలా వ్యూహాలు రచిస్తోంది. పార్టీ శ్రేణులను ఏకం చేస్తోంది. ఇతర పార్టీలోని కీలక నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలతో దూకుడుమీదున్న కమలం నేతలు.. త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ , సాగర్‌ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు.

అంతేకాదు… వరంగల్‌, ఖమ్మంతోపాటు ఇతర కార్పొరేషన్లకు జరిగే ఎలక్షన్స్‌లోనూ విజయమే లక్ష్యంగా ఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే… రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్‌ తరుణ్‌చుగ్‌ మూడు రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో త్వరలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి.

హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల స్థానం, అటు వరంగల్‌,ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్‌ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండింటిలో ఒకటి బీజేపీ సిట్టింగ్‌ స్థానం. సిట్టింగ్‌ సీటును కాపాడుకోవడంతోపాటు… మరో స్థానాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ప్రిపరేటరీ సమావేశం జరిగింది. పార్టీ శ్రేణులకు తరుణ్‌చుగ్‌ దిశానిర్దేశం చేశారు. ఇందుకోసం ఎలక్షన్‌ ప్లాన్‌ను సిద్దం చేశారు. ప్రతి ఓటును తమవైపు తిప్పుకునేందుకు పక్కా స్కెచ్‌ వేస్తున్నారు. ప్రతి పదిఓట్లకు ఒక ఇన్‌చార్జీని నియమించాలని తరుణ్‌చుగ్ పార్టీ శ్రేణులకు సూచించారు.

మరోవైపు నిజామాబాద్‌లో పర్యటించిన తరుణ్‌చుగ్‌, బండి సంజయ్‌ ప్రభుత్వంపైనా, కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని దీమా వ్యక్తం చేశారు. తాము ఇంకా ఆట మొదలుపెట్టలేదని.. అప్పుడే టీఆర్‌ఎస్‌ నేతల్లో వణుకు ప్రారంభమైందన్నారు. తెలంగాణలో ప్రజా పాలనకు బదులు… కుటుంబ పాలన కొనసాగుతోందని విమర్శించారు.

తరుణ్‌ చుగ్‌ ఇవాళ ఖమ్మంలో పర్యటించనున్నారు. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంనలో బీజేపీ నేతలు ఖమ్మం టూర్‌లో చేయాలని నిర్ణయించారు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం మేథావులతో రాజకీయ స్థితిగతులపై మథనం జరుపుతారు. ఆతర్వాత బూత్‌ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు. తరుణ్‌ చుగ్‌ పర్యటన కోసం ఖమ్మం బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.