Telangana: అందుకే కేసీఆర్ భయపడిపోయి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు: రాజా సింగ్
బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ జరిమానా వేయడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఇవాళ 10 టీవీతో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వేలు చేయించడం అలవాటని చెప్పారు.
Telangana: బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ జరిమానా వేయడం దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఇవాళ 10 టీవీతో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వేలు చేయించడం అలవాటని చెప్పారు. సర్వేలలో టీఆర్ఎస్ జీరో జీరో జీరో అని, బీజేపీ హీరో హీరో హీరో అని తేలుతోందని ఆయన అన్నారు. దీంతో భయపడిన కేసీఆర్ బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
టీఆర్ఎస్ ప్లీనరీ సమయంలో స్పందించని జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు ఎందుకు హడావిడి చేస్తున్నారని ఆయన నిలదీశారు. తమ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన బోర్డుకు రూ.50,000కు పైగా జరిమానా వేశారని ఆయన చెప్పారు. తాము ఏర్పాటు చేసే ఫ్లెక్సీలకు అనుమతులు ఇవ్వాలని కోరుతున్నామని, అయితే, అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు.
అధికారులు అనుమతులు ఇచ్చినా, ఇవ్వకున్నా తాము ఏర్పాటు చేయాలనుకున్న చోట ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆఖరికి ప్రధాని వెళ్లే దారిలో సైతం టీఆర్ఎస్ వారే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాటు చేసిన ఆ ఫ్లెక్సీలను, బోర్డులను వారే తొలగిస్తే మంచిదని ఆయన హెచ్చరించారు.