మహిళల కోసం మరో పథకం..మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలు పంపిణీ

మహిళల కోసం మరో పథకం..మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలు పంపిణీ

Telangana mobile fish outlet scheme : సీఎం కేసీఆర్ ప్రభుత్వం మహిళల ఉపాధి కోసం మరో కొత్త పథకం ప్రవేశపెట్టింది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో మత్స్యకారులకు ఇప్పటికే టూవీలర్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలు సబ్సిడీ మీద అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మహిళలు ఆర్థికంగా బలపడాలనే ఉద్ధేశ్యంతో జీహెచ్‌ఎంసీలో మహిళల కోసం ఓ కొత్త పథకం తీసుకొచ్చింది. చేపలు, చేపల వంటకాల విక్రయానికి మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లకు ఒక్కొక్కటి చొప్పున 150 సంచార చేపల విక్రయ వాహనాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొబైల్ చేపల విక్రయ వాహనం ఖరీదు రూ.10 లక్షలు. కానీ మహిళల కోసం ప్రభుత్వం 60 శాతం సబ్సిడీతో అందజేయనుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా మత్స్యకారుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం.

ఈక్రమంలో తాజాగా చేపలను, చేపల వంటకాలను నేరుగా వినియోగదారుడి వద్దకు చేర్చడంతో పాటు, వాటి విక్రయం ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంభన పొందేలా చేయడమే ఈ మొబైల్ ఫిష్ ఔట్ లెట్స్ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. దీంతో మహిళలు లబ్ది పొందాలని ఆకాంక్షిస్తోంది. సహజంగానే కష్టపడే తత్వం ఉండే మహిళలు కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఈ కొత్త పథకంతో మహిళలు మరింతగా ఆర్థికంగా బలపడాలని ప్రభుత్వం భావిస్తోంది.