POP Ganesh Statues : వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

POP Ganesh Statues : వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు

Pop Statues

POP Ganesh Statues : వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని స్పష్టం చేసింది. అయితే, పీవోపీ(ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే నీటి కుంటల్లోనే నిమజ్జనం చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

పీవోపీ విగ్రహాల నిషేధంపై గతంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలు జారీ చేసింది. పీసీబీ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ విగ్రహ తయారీదారులు వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పీవోపీ విగ్రహాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి జీవో ఇవ్వలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. పీవోపీ విగ్రహాల నిషేధంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

కనీసం విగ్రహాల ఎత్తును తగ్గించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనను కూడా తోసిపుచ్చిన హైకోర్టు.. కొత్త అంశాలను తెరపైకి తేవద్దని వ్యాఖ్యానించింది. సీపీసీబీ మార్గదర్శకాల చట్టబద్ధతను తుది విచారణలో తేలుస్తామంటూ విచారణను వాయిదా వేసింది. ఇక దుర్గా పూజపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మార్గదర్శకాలను పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు.

శాస్త్రీయ అధ్యయనం లేకుండా సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదించారు. పీవోపీపై నిషేధం లేదని.. అలాంటప్పుడు కేవలం విగ్రహాల తయారీలో వినియోగించొద్దనడం సమంజసం కాదన్నారు. జీహెచ్ఎంసీ బేబీ పాండ్లను (నీటి కుంటలు) సరిగా నిర్వహించలేక.. పీవోపీ విగ్రహాల తయారీ, విక్రయాలు నిలిపివేయాలని కళాకారులపై దాడి చేస్తోందన్నారు. కొవిడ్‌కు ముందు తయారు చేసిన విగ్రహాలనైనా విక్రయించేందుకు అనుమతివ్వాలని కోరారు.

వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ.. పీవోపీ విగ్రహాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి వరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదని తెలిపింది. ప్రస్తుతం నిషేధం లేనందున.. కొందరి ఉపాధి దెబ్బతినేలా ఉత్తర్వులు ఇవ్వమని హైకోర్టు స్పష్టం చేసింది.

అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో మాత్రం నిమజ్జనం చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే బేబీ పాండ్లలో నిమజ్జనం చేసి వెంటనే తొలగించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో నదులు, సముద్రాలు లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని పేర్కొంది.