గిరిజనులే టార్గెట్..అనారోగ్యంతో ఉన్నవారికి బీమా..నామినీతో ఒప్పందం చేసుకుని హత్యలు..!!

గిరిజనులే టార్గెట్..అనారోగ్యంతో ఉన్నవారికి బీమా..నామినీతో ఒప్పందం చేసుకుని హత్యలు..!!

Insurance Agents killed 6 persons and claim in crores of rupees : ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులు లేదా మృతుల కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటుంది బీమా చేయించుకుంటుంటారు. కానీ ఆ బీమా కాసుల కోసం కక్కుర్తి పడి ఏకంగా మనుషులు ప్రాణాల్నే తీసేస్తున్న ముఠాలు తయారయ్యాయి. గుట్టు చప్పుడు కాకుండా నామినీలతో ఒప్పందాలు కుదుర్చుకుని సదరు బీమా చేయించుకున్న వ్యక్తుల్ని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు..సదరు ముఠాను అరెస్ట్ చేశారు. అలా ఇప్పటి వరకూ సదరు ముఠా ఐదుగురు వ్యక్తుల్ని హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠాలలో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. అలా ఇప్పటి వరకూ 17మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా..ఈ బీమా డబ్బుల్ని కాజేస్తున్న ముఠా టార్గెట్ గిరిజనులే కావటం గమనించాల్సిన విషయం..

అనారోగ్యంతో బాధపడుతున్న వారితో బలవంతంగా బీమా చేయించి ఆ తరువాత వారిని హత్యచేసి బీమా సొమ్మును కొట్టేస్తున్న ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బుల కోసం ఈ ముఠా ఏకంగా ఐదారుగురిని మట్టుబెట్టిన విషయం తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. డబ్బుల కోసం ఇంతటి దారుణాలకు తెగబడుతున్న ముఠాను వివరాలు చెబుతుంటే పోలీసులే విస్తుపోతున్నారు.

గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల వివరాలను ఈ ముఠా ముందే సేకరిస్తుంది. ఈ తరువాత ముఠా సభ్యులు రంగంలోకి దిగుతారు. వారి కుటుంబ సభ్యులను కలిసి బీమా కట్టేలా ఒప్పిస్తారు. ఒకటి రెండు ప్రీమియంలను ముఠా సభ్యులే కడతారు. ఆ తర్వాత ముఠా సభ్యులు తమ పక్కా ప్లాన్ ను అమలు చేసేందుకు రంగంలోకి దిగుతారు. బీమా చేయించుకున్న వ్యక్తి నామినీతో ఒప్పందం కుదుర్చుకుంటారు. వారు ఒప్పుకోకపోతే..పదే పదే నచ్చచెబుతారు. మీరు పైసా కట్టలేదు..పైగా మీకు లక్షల రూపాయలు వస్తాయి. సదరు బీమా చేయించుకున్న వ్యక్తి బతికి ఉన్నా..అంత డబ్బు సంపాదించలేడు. ఆ డబ్బు మీ కుటుంబానికి చాలా ఉపయోగపడుతుంది అంటూ పలు రకాలుగా నచ్చచెబుతారు. అందకీ లొంగకపోతే బెదిరిస్తారు.

అనంతరం బీమా తీసుకున్న వ్యక్తిని హత్య చేసి రోడ్డు మీదకు తెచ్చి పడేస్తారు. ఆ తరువాత ఏదోక వాహనంతో గుద్దించి రోడ్డు ప్రమాదంగా క్రియేట్ చేస్తారు. ఆపై ఎఫ్ఐఆర్ కాపీ సేకరించి బీమాకు క్లెయిమ్ చేస్తారు. వచ్చిన మొత్తంలో కుటుంబసభ్యులకు 20 శాతం ఇచ్చి మిగతా మొత్తాన్ని ముఠా సభ్యులు అందరూ కలిసి పంచుకుంటారు. ఇలా ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు క్లెయిమ్ చేసినట్టుగా పోలీసుల విచారణలో తెలుస్తోంది.

దామచర్ల మండలంలోని ఓ గిరిజన తండాకు చెందిన ఇద్దరు ప్రైవేటు బీమా ఏజెంట్లు ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు తమ విచారణలో గుర్తించారు. గత కొన్నేళ్లుగా హత్యలకు సహకరిస్తున్న 17 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టుగా సమాచారం. ఓ ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఏజెంట్‌ కోసం గాలిస్తున్నారు.

దామచర్ల మండలంలోని కొండ్రపోల్‌కు చెందిన దేవిరెడ్డి కోటిరెడ్డి మృతదేహం వారం క్రితం నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి పక్కన కనిపించింది. ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే ఆయన మరణించాడని కుటుంబ సభ్యులను అతని భార్య నమ్మించింది. కానీ.. అంత్యక్రియల సమయంలో కోటిరెడ్డి శరీరంపై గాయాలను చూసిన అతని తల్లిదండ్రులు అనుమానపడ్డారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు కోటిరెడ్డి భార్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో బీమా కోసం ఇలా చేశానని..కొంతమంది తనను ఒప్పించి ఇలా చేశారని తెలియటండో ఈ బీమా దందా వెలుగులోకి వచ్చింది.

బీమా డబ్బుల కోసం ప్రియుడితో కలిసి తానే చంపించినట్టు అంగీకరించింది. ఈ హత్యలో భాగం పంచుకున్న బీమా ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతడు చెప్పింది విని షాకయ్యారు. బీమా సొమ్ము కోసం గత మూడేళ్లలో ఐదారుగురిని హత్య చేసినట్టు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో వీరిని రిమాండ్‌కు పంపనున్నట్టు సమాచారం.