తెలంగాణలో భక్తులకు శుభవార్త, త్వరలో ఆలయాల్లోకి ప్రవేశం

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది.

  • Published By: naveen ,Published On : May 27, 2020 / 08:24 AM IST
తెలంగాణలో భక్తులకు శుభవార్త, త్వరలో ఆలయాల్లోకి ప్రవేశం

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది.

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది. భక్తులకు దైవ దర్శనం కలగనుంది. దేవాలయాల్లోకి భక్తులకు ప్రవేశం కల్పించే అవకాశం ఉంది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ ఎఫెక్ట్ మనుషులపైనే కాదు దేవుళ్లపైనా పడింది. కరోనా కారణంగా గత రెండు నెలలుగా ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. దర్శనాలు నిలిపివేశారు. దీంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలకు అవకాశం కల్పించినా.. కనులారా భగవంతుడిని చూడకుండా పూజలు చేస్తే ఫలితం ఏంటని వాపోతున్నారు. 

పూజలకు నో, దర్శనం మాత్రమే:
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనల్లో కొన్నింటికి సడలింపు ఇచ్చింది. బస్సులు నడుపుతున్నారు. రైళ్లు కూడా తిరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్న దేవాలయాలను ఆదుకునేందుకు ఎండోమెంట్‌ అధికారులు చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాలుగో దశ లాక్‌డౌన్‌ పూర్తి కానున్న నేపథ్యంలో జూన్‌లో ఆలయాల్లోకి భక్తులకు ప్రవేశం కల్పించే అవకాశం, ఈ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించినట్లు సమాచారం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఆలయాల్లో పాటించాల్సిన విధి విధానాలపై కార్యాచరణ రూపొందిస్తున్నారు. పూజలకు అవకాశమిస్తే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పాటు ఎక్కువ సమయం ఒకేచోట ఉంటారని, తద్వారా భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని యోచిస్తున్నారు. అందుకే దైవ దర్శన భాగ్యం మాత్రమే కల్పించాలని భావిస్తున్నారు.

గదులు అద్దెకివ్వరు:
వేసవి సెలవుల్లో భద్రాచలం రామాలయానికి నిత్యం 15 వేల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్‌ టన్నెల్‌ ద్వారా ఆలయం లోపలకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్గదర్శకాలను జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో 27 కాటేజీలు, 140 గదులు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గదులు అద్దెకిస్తే భౌతిక దూరం పాటించే అవకాశం ఉండదని, గదులు అద్దెకిస్తే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఒకటి, రెండు రోజులు ఉంటారని, అందుకే గదులు అద్దెకు ఇవ్వొద్దని యోచిస్తున్నారు. కాగా, భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తారని తెలుస్తోంది. అందరూ కచ్చితంగా మాస్క్ ధరించాల్సి ఉంటుందని, ప్రతి ఒక్కరూ విధిగా సామాజిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా త్వరలోనే ఆలయాలు తిరిగి తెరుస్తారని, దైవ దర్శనానికి అనుమతి ఇస్తారనే వార్త భక్తుల్లో ఆనందం నింపింది. ఎప్పుడెప్పుడు ఆలయాలు తెరుస్తారా, దైవ దర్శనం చేసుకుంటామా అని భక్తులు ఎదురుచూస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు భారీగా సడలింపులు:
‘కరోనా వైరస్’ లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ పొడిగిస్తూ వెళ్లారు. ఇప్పటి వరకు నాలుగు లాక్ డౌన్‌లు విధించారు. ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతోంది. మే 31 వరకు లాక్ డౌన్ 4 అమలులో ఉంటుంది. కాగా, లాక్ డౌన్ తో కుదేలైన దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేందు లాక్ డౌన్ 4వ దశలో కేంద్రం భారీగా సడలింపులు ఇచ్చింది. ఫ్యాక్టరీలు, కంపెనీలు, వ్యాపార సముదాయాలు తెరుచుకునేందుకు కొన్ని మార్గదర్శకాలు, సడలింపులతో అనుమతి ఇచ్చారు. దీంతో కొద్ది రోజుల క్రితం నుంచే ఆంక్షల మధ్య వాణిజ్య సముదాయాలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు తెరుచుకుంటున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ కూడా పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. బస్సులు, రైళ్లు, విమానాలు తిరుగుతున్నాయి. 

ఆలయాలు తెరుస్తున్న తొలి రాష్ట్రం కర్నాటక:
కాగా ఆలయాలు తిరిగి తెరిచే విషయంలో కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలు తెరవాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌ 4 తర్వాత ఆలయాలు తెరుస్తున్న మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. కర్ణాటకలో జూన్‌ 1వ తేదీ నుంచి దేవాలయాలు తెరుచుకోనున్నాయి. నిర్థిష్ట మార్గదర్శకాలను అనుసరించి ఆలయాల్లోకి భక్తులకు అనుమతిస్తారు. అన్ని జాగ్రత్తలతో ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తామన్నారు. ఆలయాల్లో భక్తులు భౌతిక దూరం పాటించేలా చూస్తామన్నారు. అన్ని రకాల పూజా కార్యక్రమాలు కొనసాగనున్నట్లు తెలిపారు. పరిస్థితులను అనుసరించి పరిమిత సంఖ్యలో మాత్రమే భక్తులను అనుమతిస్తామన్నారు.

Read: మృతదేహాలకు కూడా కరోనా పరీక్షలు చేయాల్సిందే..ఎందువల్ల చనిపోయారో తెలుసుకోరా..