ఎల్ బి నగర్ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత..టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
LB Nagar polling station Tension : జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ ఎల్ బి నగర్ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్ కేపురం డివిజన్ పోలింగ్ బూత్ లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది.
డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈక్రమంలో విక్రమ్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.
ఆర్ కేపురంలోని బూత్ నెంబర్ 42, 45 లో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. పోలింగ్ బూతుల బయట ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు ఓటర్ స్లిప్స్ పంచే సమయంలో కొంతమంది టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య బాహాబాహీ జరిగింది.
ఓటర్లను టీఆర్ఎస్ నేత విక్రమ్ రెడ్డి ప్రలోభపెడుతున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్ కేపురం డివిజన్ లో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఘర్షణకు దిగిన ఇరుపార్టీల శ్రేణులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
గ్రేటర్ పోలింగ్ ప్రశాంతంగానే ప్రారంభమైంది. తక్కువ సంఖ్యలోనే పోలింగ్ శాతం నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పోలింగ్ ఊపందుకుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్న నేపథ్యంలో పార్టీల మధ్య ఘర్షణాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.