Toolkit Case : టూల్ కిట్ కేసు..ఇద్దరు కాంగ్రెస్ నేతలకు నోటీసులు

కోవిడ్-19​ టూల్​కిట్​ కేసుకి సంబంధించి ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నోటీసులు ఇచ్చింది.

Toolkit Case : టూల్ కిట్ కేసు..ఇద్దరు కాంగ్రెస్ నేతలకు నోటీసులు

Toolkit Case Delhi Police Sends Notice To Two Congress Leaders

Toolkit Case కోవిడ్-19​ టూల్​కిట్​ కేసుకి సంబంధించి ఇద్దరు కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నోటీసులు ఇచ్చింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా టూల్ కిట్ ట్విట్ పై ట్విట్టర్ కు ఫిర్యాదు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు-కాంగ్రెస్ సోషల్ మీడియా హెడ్ రోహన్ గుప్తా, కాంగ్రెస్ ప్రతినిధి ఎంవీ రాజీవ్ గౌడకు మంగళవారం ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నోటీసులు ఇచ్చింది. దర్యాప్తునకు సహకరించాలని ఇద్దరు కాంగ్రెస్ నేతలను కోరినట్లు సీనియర్ పోలీసు అధికారి స్పష్టం చేశారు. అయితే..ఇవి కొత్తగా ఇస్తున్న నోటీసులు కాదని 8-9 రోజుల క్రితమే ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్​ నేతలు సహకరిస్తే దర్యాప్తు వేగంగా పూర్తి చేయొచ్చని తెలిపారు.

ఇక, కోవిడ్ టూల్ ​కిట్ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సోమవారం ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ట్విట్టర్​ కు నోటీసులు ఇచ్చింది. బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ట్వీట్​ ను ‘మ్యానిపులేటెడ్ మీడియా’ అని ఏ విధంగా పరిగణించిందో వివరించాలని కోరింది. అనంతరం ఢిల్లీ లాడోసరాయ్, గురుగ్రామ్ ​లోని ట్విట్టర్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.

ఇక,బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ట్వీట్‌ పై ‘మ్యానిపులేటెడ్ మీడియా’ అని ట్యాగ్​ జోడించినట్లే 11 మంది కేంద్ర మంత్రుల ట్వీట్లపై కూడా ‘మ్యానిపులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ జోడించాలని ట్విట్టర్ ఇండియాను మంగళవారం కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ విషయమై ట్విట్టర్ ఇండియాకు.. కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా లేఖ రాశారు. ఇందులో కేంద్ర మంత్రులు పీయూష్ గోయెల్, స్మృతి ఇరానీ, రవి శంకర్ ప్రసాద్, గిరిరాజ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, ధర్మేంద్ర ప్రధాన్, రమేష్ పోక్రియాల్ నిషాంక్, తవార్‌చంద్ గెహ్లోత్, హర్ష వర్ధన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గజేంద్ర సింగ్ షేకావత్‌ లు “కాంగ్రెస్ టూల్‌కిట్ బయటపడింది” అంటూ చేసిన ట్వీట్లపై ‘మ్యానిపులేటెడ్ మీడియా’ అని ఫ్లాగ్ వేయాలని సూర్జేవాలా కోరారు. ఫోర్జరీకి పాల్పడిన మంత్రులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కాంగ్రెస్​ టూల్​కిట్​గా వెలుగులోకి వచ్చిన డాక్యుమెంట్లను ట్విట్టర్ మ్యానిపులేటివ్ మీడియాగా పేర్కొన్నట్లు గుర్తుచేశారు.