Lockdown in AP: సంపూర్ణ లాక్డౌన్ దిశగా ఏపీ.. కాసేపటిలో నిర్ణయం?
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతుండగా.. ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Lockdown in AP: దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నాలుగు లక్షలకుపైగా నిత్యం నమోదవుతుండగా.. ఏపీలోనూ ఈ కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇక్కడ నిత్యం 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తుండగా కేసులు మాత్రం తగ్గడం లేదు. ఉదయం 6 నుండి 12 గంటల వరకు ప్రజలకు అనుమతి ఉండడంతో ఈ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వస్తున్నారు.
ఇప్పటికే ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు 20 శాతం మించిపోయింది. పదిశాతం మించని రాష్ట్రాలలో కూడా సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతున్నా ఏపీ ఇప్పటి వరకు కఠిన ఆంక్షలతోనే కరోనా కట్టడి చేయాలని ప్రయత్నించింది. కానీ.. పాజిటివ్ కేసులు మాత్రం నిత్యం ఇరవై వేలకు పైగానే నమోదవుతున్నాయి. మరోవైపు రెండు లక్షల మందికి పైగా యాక్టివ్ కేసులు ఉంటున్నాయి. కాగా, రేపటితో ప్రస్తుతం అమలవుతున్న పగలు 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ముగియనుంది.
దీంతో రాష్ట్రంలో తదుపరి కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వం సమాలోచన చేస్తుంది. ఇప్పటికే ఐసీఎంఆర్ ఆరు నుండి ఎనిమిది వారాలు లాక్ డౌన్ అమలు చేయాలని సూచించగా రాష్ట్ర వైద్యాధికారులు కూడా అదే భావనలో ఉన్నారు. తదుపరి నిర్ణయంపై సీఎం జగన్ అధ్యక్షతన నేడు సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయడమా.. లేక ఇప్పుడున్న కర్ఫ్యూ సడలింపు సమయాన్ని మరింత కుదించడమా అన్నది నిర్ణయించనున్నారు.