Revanth Reddy Corona : కరోనా లక్షణాలతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి.. మునుగోడు పాదయాత్రకు దూరం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. కరోనా లక్షణాల నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు.
Revanth Reddy Corona : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం రేవంత్ రెడ్డిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో తన ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన కరోనా పరీక్షకు సంబంధించిన రిపోర్ట్ రావాల్సి ఉంది. కరోనా లక్షణాల నేపథ్యంలో మునుగోడులో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన పాదయాత్రకు రేవంత్ రెడ్డి దూరంగా ఉన్నారు.
తాను మునుగోడు పాదయాత్రకు రాలేనని, అందుకు గల కారణాలను వివరిస్తూ పార్టీ నేతలు, శ్రేణులకు సందేశం పంపారు రేవంత్ రెడ్డి. నల్లగొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శనివారం పాదయాత్ర మొదలుపెట్టింది. నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగనున్న పాదయాత్ర రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే మొదలు కావాల్సి ఉంది. ఈ మేరకు యాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం కాగా.. రేవంత్ రెడ్డి కూడా యాత్రకు పార్టీ నేతలను ఆహ్వానిస్తూ తాను కూడా సిద్ధమైపోయారు. యాత్రకు రానన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సారీ కూడా చెప్పారు. ఇంతలోనే ఆయన కరోనా బారిన పడ్డారు.
ఆజాదీ గౌరవ్ యాత్ర కార్యక్రమంలో నేటి నుంచి వారం రోజుల పాటు మునుగోడు నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పాదయాత్రకు కాంగ్రెస్ ముఖ్యనేతలు దూరంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొనాల్సి ఉన్నా కరోనా లక్షణాలతో పాదయాత్రకు దూరం అయ్యారు. కాంగ్రెస్ చేపట్టిన ఈ పాదయాత్ర రాజీవ్ గాంధీ జయంతి రోజున (ఆగస్టు 20) చౌటుప్పల్లో ముగియనుంది.
కాగా, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పారు. హోంగార్డ్ ప్రస్తావన, చండూరులో కాంగ్రెస్ సభలో వ్యాఖ్యలపై రేవంత్ సారీ చెప్పారు. ఈ మేరకు రేంత్ రెడ్డి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చండూరు సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, ఆయనను అవమానించేలా అద్దంకి దయాకర్ మాట్లాడటం తగదని రేవంత్ అన్నారు.