TTD: మే 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు
తిరుమలలో ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
TTD: తిరుమలలో ఈ నెల 25 నుంచి 29 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం ఉదయం హనుమజ్జయంతి ఏర్పాట్లపై అధికారులతో ధర్మారెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ హనుమంతుని జన్మస్థలమైన అంజనాద్రిలోని ఆకాశగంగ వద్ద, జాపాలి తీర్థం, నాద నీరాజనం వేదిక, ఎస్వీ వేద పాఠశాలలో కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మే 29న ధర్మగిరి వేదపాఠశాలలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
TTD Temple: శాస్త్రోక్తంగా శ్రీవారి మెట్టు నడకదారి పునఃప్రారంభం
నాద నీరాజనం వేదికపై నిర్వహించే ప్రవచనాలకు సంబంధించి ఆచార్య రాణి సదా శివమూర్తి, డా. ఆకెళ్ల విభీషణశర్మ, శ్రీ పవన కుమార శర్మ తదితర పండితులను భాగస్వాములను చేయాలన్నారు. అంజనాద్రి వైభవం, ఇతిహాస హనుమద్విజయం, యోగాంజనేయం, వీరాంజనేయం, భక్తాంజనేయం వంటి పలు అంశాలపై ప్రవచనాలు ఉంటాయని ధర్మారెడ్డి చెప్పారు. ఏర్పాట్లకు సంబంధించి ఇంజినీరింగ్, అన్నదానం, ధర్మప్రచార పరిషత్, ఎస్వీ వేద పాఠశాల, భద్రతా విభాగం, పీఆర్వో, ఎస్వీబీసీ విభాగాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు వీలుగా ఎస్వీబీసీ నాలుగు ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు.