షూటింగులో వ్యక్తికి కరోనా.. ఉలిక్కిపడ్డ టీవీ పరిశ్రమ..

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 03:20 AM IST
షూటింగులో వ్యక్తికి కరోనా.. ఉలిక్కిపడ్డ టీవీ పరిశ్రమ..

కరోనా వైరస్.. గతకొద్ది నెలలుగా ప్రజలపై ఈ మహమ్మారి చూపిస్తున్న ప్రభావం వర్ణనాతీతం. అన్నిరంగాలతో పాటు టీవీ, సినిమా రంగాలపై తీవ్రంగా దెబ్బకొట్టింది కోవిడ్-19. ఆ గడ్డు పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుని షూటింగు షెడ్యూళ్లు ప్లాన్ చేసుకుంటుండగా దీని ప్రభావం మరోసారి సినిమా, టీవీ పరిశ్రమలపై పడిందనే వార్తలతో అందరూ ఉలిక్కిపడ్డారు. వివరాళ్లోకి వెళ్తే.. ఓ ప్రముఖ ఛానెల్‌‌లో ప్రసారం అయ్యే సీరియల్ షూటింగ్‌లో పాల్గొంటున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా టీవీ పరిశ్రమ ఉలిక్కిపడింది.

లాక్‌డౌన్ మినహాయింపుల తర్వాత సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే పలువురు నటులు, సిబ్బంది కరోనా బారిన పడటంతో సినిమా, టీవీ పరిశ్రమ వర్గాల్లో కలకలం, కలవరం మొదలైంది. మొదట్లో ఒకటి రెండు రోజుల మినహా పలు షూటింగ్స్‌లో యూనిట్ సభ్యులు జాగ్రత్తలు తీసుకోవడం లేదు.. అందుకే కొందరు కరోనా బారిన పడుతున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ సమయంలో షూటింగ్స్ నిలిపివేయాలనే విజ్ఞప్తులు కూడా ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా టీవీ పరిశ్రమ ఊపిరి పీల్చుకునే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది.

 

ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా వారందరికీ నెగిటివ్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారం మరింత జాగ్రత్తలతో షూటింగ్స్ జరపాలని టీవీ పరిశ్రమ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఇకపై షూటింగ్‌లో పాల్గొంటామని సినీ, టీవీ నటీనటులు మరియు కార్మికులు గట్టిగా చెబుతున్నట్లు టాలీవుడ్ వర్గాల వారి సమాచారం.

Read: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తెలుగందం తేజస్వి..