బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినరోజే యూఎస్ లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినరోజే యూఎస్ లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు

U.S. sees record-high daily COVID-19 deaths అమెరికాలో కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణస్వీకారం చేసిన రోజే దేశంలో కరోనా మరణాలు రికార్డు స్థాయికి చేరుకున్నారు. బుధవారం ఒక్కరోజే అమెరికాలో రికార్డుస్థాయిలో 4,383 కరోనా మరణాలు నమోదయ్యాయి. ఒక్కరోజు కరోనా మరణాల్లో ఇదే అత్యధికం. ఇక అదే రోజున 188,156 కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇక, బుధవారం రోజున…కరోనా మొదలైనప్పటినుంచి అమెరికాలో 30లక్షలకు పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. అమెరికాలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియా అన్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియా రాష్ట్రంలో దాదాపు 4కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు.

ఇక, యూఎస్ లో ఇప్పటివరకు నమోదైన మరణాల సంఖ్య రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మరణించిన అమెరికన్ల సంఖ్యను దాటిపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 4,05,399 అమెరికన్ సైనికులు మరణించగా బుధవారం సాయంత్రం నాటికి, యూఎస్ లో కరోనాతో 4,05,400 మంది మరణించారని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకటించింది.

కాగా.. అగ్రరాజ్య అధినేతగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే బైడెన్.. కొవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటూ పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లపై సంతకం చేశారు. అమెరికాకు వెళ్లే ప్రయాణికులకు నెగటివ్ సర్టిఫికేట్‌ను తప్పనిసరి చేస్తూ ఆ దేశం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బైడెన్ తాజా ఉత్తర్వుల ప్రకారం.. ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్‌తోపాటు క్వారెంటైన్‌ తప్పనిసరి అయింది. అమెరికాలో కరోనా తీవ్రత రోజు రోజుకీ మరింత ఎక్కువ అవుతుందని.. రానున్న రోజుల్లో మరింత క్లిష్ట, ప్రాణాంతక సమయంలోకి అడుగు పెడుతున్నామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఇలాంటి చీకటి సమయాన్ని మనమందరం కలసికట్టుగా ఎదుర్కోవాలని ఆయన అన్నారు. అమెరికాలో కరోనా వైరస్ మరణాల సంఖ్య ఫిబ్రవరిలో 5లక్షలకు చేరుతుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ).. రాబోయే మూడు వారల్లో కొవిడ్ కారణంగా అమెరికాలో 90వేల మంది మరణించొచ్చని గత వారం వెల్లడించింది. ఫిబ్రవరి 6 నాటికి అమెరికాలో కొవిడ్ మరణాల సంఖ్య 4.40-4.77లక్షల మధ్య ఉంటుందని ఓ నివేదికలో తెలిపింది.