బోణి కొట్టిన భారత్.. భారీ విజయం‌‌

బోణి కొట్టిన భారత్.. భారీ విజయం‌‌

India Vs England

India vs England, 2nd T20: ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా‌ బోణి కొట్టింది. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌.. ఇషాన్‌ అరంగ్రేటం మ్యాచ్‌లో అదరగొట్టడంతో.. భూవీ, శార్ధూల్ లైన్‌ అండ్ లెంగ్త్‌ బౌలింగ్‌.. అన్నీ కలిసొచ్చి ఆల్‌రౌండ్‌ పర్ఫామెన్స్‌తో ఇంగ్లండ్‌పై గెలిచి టీ-20 సిరిస్‌ను సమం చేసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని మరో 13 బంతులు ఉండగానే ఏడు వికెట్లు తేడాతో గెలిచింది.

ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేయగా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే యువ బ్యాట్స్‌మ‌న్ ఇషాన్ కిష‌న్‌ 32 బంతుల్లో 56 పరుగులతో ఆక‌ట్టుకున్నాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుకు గెలుపు అందించాడు. లక్ష్యం చిన్నదైనా మొదట్లోనే భారత్‌కి కేఎల్ రాహుల్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. శామ్‌ కరన్‌ వేసిన తొలి ఓవర్‌ ఆఖరి బంతికి వికెట్‌ కీపర్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ అయ్యాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్.. అరంగేట్రం మ్యాచ్‌ అయినప్పటికీ స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ.. స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. జోప్రా ఆర్చర్, బెన్‌ స్టోక్స్, ఆదిల్ రషీద్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టాడు. భారీ షాట్లు ఆడిన ఇషాన్ కిషన్.. కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కి 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 28 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఇషాన్.. ఆ వెంటనే రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ 13 బంతుల్లో 26 పరుగులతో మెరుపులు మెరిపించి అవుటయ్యాడు. చివర్లో శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి దూకుడుగా ఆడిన కోహ్లీ.. ఓ సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. వరుసగా ఫోర్, సిక్స్ కొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు కెప్టన్‌. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

తొలి ఓవర్‌లోనే జోస్‌ బట్లర్‌ డకౌట్‌ అవగా.. ఓపెనర్‌ జేసన్‌ రాయ్.. ‌వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ మలన్‌తో కలిసి ధాటిగా ఆడాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న పార్ట్‌నర్‌షిప్‌ని యుజ్వేంద్ర చాహల్‌ బ్రేక్ చేశాడు. మలన్‌ను వికెట్లముందు దొరకబుచ్చుకుని చహల్‌ పెవిలియన్ దారి చూపాడు. జానీ బెయిర్‌స్టోతో కలిసిన రాయ్‌ మరింత ధాటిగా ఆడటం మొదలు పెట్టాడు.

అర్ధ శతకానికి చేరువైన రాయ్‌ని ఓ అద్భుత బంతితో బోల్తా కొట్టించాడు వాషింగ్టన్‌ సుందర్‌. క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్.. బెయిర్‌స్టోతో కలిసి బౌండరీలు బాదినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సుందర్‌.. బెయిర్‌స్టోను, ఠాకుర్‌.. మోర్గాన్‌ను పెవిలియన్‌ పంపారు. చివర్లో బెన్ ‌స్టోక్స్, సామ్‌ కరన్ భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నించినా కుదరకపోవడంతో 164 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు ఇచ్చింది ఇంగ్లాండ్.

ఒకానొక టైమ్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసేలా కనిపించినా.. భువనేశ్వర్, శార్ధూల్‌ లైన్‌ తప్పకుండా బౌలింగ్ చేసి కట్టడి చేశారు. భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఇషాన్‌ కిషన్‌ అరంగ్రేటం చేసిన మ్యాచ్‌లోనే మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా.. మూడో టీ20 మ్యాచ్‌ అహ్మదాబాద్‌లోనే మంగళవారం జరగనుంది.