అమానుషం, రూ.20 కోసం చిన్నారి దారుణ హత్య

కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.20 నోటు కోసం కక్కుర్తి పడ్డ ఓ యువతి అభం

  • Published By: naveen ,Published On : May 15, 2020 / 02:18 AM IST
అమానుషం, రూ.20 కోసం చిన్నారి దారుణ హత్య

కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.20 నోటు కోసం కక్కుర్తి పడ్డ ఓ యువతి అభం

కర్నాటక రాష్ట్రం బెళగావి జిల్లాలో దారుణం జరిగింది. కేవలం రూ.20 నోటు కోసం కక్కుర్తి పడ్డ ఓ యువతి అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా చంపేసింది. జాగనూర గ్రామంలో ఈ ఘోరం జరిగింది. బుధవారం(మే 13,2020) దివ్య(4) అనే పాప బిస్కెట్లు కొనేందుకు డబ్బు తీసుకుని దుకాణానికి వెళ్తుండగా పూజ అనే యువతి చూసింది. చిన్నారి చేతిలోని డబ్బుని కాజేయాలని నిర్ణయించుకుంది. చుట్టుపక్కల చూసింది. ఎవరూ గమనించడం లేదని తెలిశాక వెంటనే పాప దగ్గరి నుంచి రూ.20 లాక్కుంది. అయితే తన డబ్బు కోసం పాప గట్టిగా ఏడ్వటం మొదలు పెట్టింది. దీంతో ఆ యువతి గాబరా పడింది. విషయం బయటకు తెలిసిపోతుందని, చుట్టుపక్కల వారు ఎవరైనా వస్తారేమోనని భయపడింది. 

వెంటనే పాపను సమీపంలోని బావి దగ్గరికి తీసుకెళ్లింది. పాపను బావిలోకి తోసేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయింది. పాప ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. పాప కోసం వెతుకుండగా బావిలో కనిపించింది. వెంటనే వారు పాపను బావి నుంచి బయటకు తీశారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. దివ్య ప్రాణాలు కోల్పోయింది.

బిస్కెట్లు కొనేందుకు వెళ్లిన పాప విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గుండెలు పగిలేలా రోదించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. నిందితురాలు పూజను అరెస్టు చేశారు. కేవలం రూ.20 కోసం ఓ యువతి చిన్నారిని అతి క్రూరంగా చంపడం స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఆ యువతిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Read Here>> యువకుడి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, మరొకరితో పెళ్లికి సిద్ధమవడంతో చంపేసింది