డయాబెటిస్ : అపోహలు – నిజాలు

  • Published By: madhu ,Published On : February 10, 2019 / 11:48 AM IST
డయాబెటిస్ : అపోహలు – నిజాలు

స్వీట్లంటే ఇష్టమా… ఎక్కువ తినేస్తావా? అయితే నీకు డయాబెటిస్ వచ్చేస్తుంది జాగ్రత్త. డయాబెటిస్ ఉందా..? అయితే అన్నం మానేసి జొన్న రొట్టె తిను.. రాత్రి పూట అన్నం మానేసి చపాతీ తినడం బెటర్… అనే మాటలు వింటూనే ఉంటాం. నువ్వసలే షుగర్ పేషెంటువి.. పండు తింటావా..? దాని బదులు కాకరకాయ రసం తాగు.. అనే మందలింపులూ, సూచనలూ కూడా వస్తుంటాయి. ఇంతకీ ఈ అభిప్రాయలన్నీ నిజమేనా? కేవలం అపోహలేనా..? నిజానిజాలేంటీ ? 

1. అపోహ : తీపి తింటే డయాబెటిస్ వస్తుందా?
నిజం – తియ్యని తేనె, బెల్లం తీసుకుంటారా..? నో ప్రాబ్లం. ఎందుకంటే తీపి పదార్థాల కన్నా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే పనీర్, ఛీజ్, బర్గర్ల వంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటేనే డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. అయితే స్వీట్లలో నూనె పదార్థాలు కూడా ఉంటాయి కాబట్టి డయాబెటిస్ ఉన్నవాళ్లు వాటి జోలికి పోవద్దు. చక్కెర తిన్నంత మాత్రాన చక్కెర వ్యాధి వస్తుందనడం కరెక్ట్ కాదు. అదేవిధంగా చక్కెర తినకపోతే రాదనీ చెప్పలేం. చక్కెర వ్యాధికీ, తినే చక్కెరకీ సంబంధం లేదు. తీపి పదార్థాల కన్నా కొవ్వు పదార్థాలు తింటేనే డయాబెటిస్ వస్తుంది. 

2. అపోహ : మధుమేహం ఉంటే అన్నం మానేయాలా?
నిజం – అన్నం తినడం వల్లనే డయాబెటిస్ కంట్రోల్ కావడం లేదు అనే నమ్మకంతో ఉంటారు చాలామంది. కానీ వందల ఏళ్లుగా తింటున్న అన్నం తింటున్నాం. కానీ డయాబెటిస్ మాత్రం ఇటీవలి కాలంలోనే పెరిగింది. కాబట్టి మనం తినే అన్నానికీ, రక్తంలో ఉండే చక్కెరకూ పెద్దగా సంబంధం లేదు. అయితే అన్నంతో పాటు నూనె పదార్థాలైన వేపుడు కూరలు, పిండివంటలు తీసుకుంటే మాత్రం కష్టమే. లో కార్బ్ డైట్ వల్ల ఉపయోగం ఏమీ లేదు. పైగా ఆహారంలో పిండి పదార్థాన్ని తగ్గిస్తే ఆటోమేటిగ్గా కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకుంటాం. దాంతో డయాబెటిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కొవ్వు పదార్థాల వల్ల సమస్య గానీ పిండి పదార్థం వల్ల కాదు. అందుకే అన్నం తినడం మానడం కరెక్ట్ కాదు. 

3. అపోహ : ఓట్స్ తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందా? 
నిజం – ఓట్స్ మన ప్రాంతానికి చెందిన పదార్థం కాదు. మన దగ్గర పండే పంటా కాదు. అది తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందనడం అపోహ. పైగా అవి రక్తంలో గ్లూకోజ్ ను పెంచుతాయి. ఓట్స్ ను ప్రాసెస్ చేసి అమ్ముతారు కాబట్టి ఓట్స్ తిన్న వెంటనే గ్లూకోజ్ పెరుగుతుంది. అలా పాశ్చాత్య దేశాల్లోంచి వచ్చిన ఏ పదార్థాలు కూడా మన వాళ్ల డయాబెటిస్ ను తగ్గించలేవు. ఓట్స్ వల్ల రక్తంలో గ్లూకోజ్ పెరుగుతుందే గానీ తగ్గదు. 

4. అపోహ. తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందా?
నిజం – వరి అన్నానికి బదులుగా రాగులు, జొన్నల వంటి చిరు ధాన్యాలు తీసుకోవడం వల్ల డయాబెటిస్ రాదనడంలో కొంత నిజం ఉన్నప్పటికీ తగ్గడం మాత్రం జరగదు. అయితే ఏ ప్రాంతంలో ఏ ఆహారపు అలవాటు ఉంటే అవి మాత్రం తీసుకోవాలి. ఎన్నాళ్ల నుంచో మన స్వభావానికి అలవాటైన ఆహారం అన్నమే. కాబట్టి అలవాటైంది తీసుకోవడమే మేలు. తృణధాన్యాల వల్ల మధుమేహం తగ్గదు. 

5. అపోహ : మధుమేహులు పండ్లు తినకూడదా?
నిజం – ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లు మామిడి, సీతాఫలం లాంటివైనా సరే వాటితో మధుమేహం వస్తుందనడం కరెక్ట్ కాదు. డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా తినొచ్చు. ఈ పండ్లలో ఉండే పిండిపదార్థం వేరు. చక్కెర వ్యాధిలో చక్కెర వేరు. పండ్లలో యాంటి ఆక్సిడెంట్లు, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. క్యాన్సర్ రాకుండా నివారించే రంగు పదార్థాలు ఉంటాయి. అందుకే డయాబెటిస్ ఉన్నంత మాత్రాన వీటిని మిస్ చేసుకోవద్దు. చక్కగా పండ్లు తినొచ్చు. 

6. అపోహ : అన్నం వదిలేసి చపాతీ తినాలా?
నిజం – గోధుమల్లో పిండి పదార్థం తక్కువగా ఉంటుందనుకుంటారు కానీ ఇది కరెక్ట్ కాదు. అన్నంలో, చపాతీలో రెండింటిలో కూడా పిండి పదార్థం ఒకే మోతాదులో ఉంటుంది. అయితే వరి బియ్యాన్ని వండుకుని తేలిగ్గా జీర్ణమయ్యే విధంగా తీసుకుంటాం కాబట్టి అరగంటలోనే రక్తంలో గ్లూకోజ్ పెంచుతుంది. కానీ గోధుమల వల్ల వెంటనే పెరగదు గానీ దానిలో ఉండే చక్కెరల పరిమాణం మాత్రం ఒకటే. గోధుమల్లో గ్లూటెన్ అనే జిగట పదార్థం ఉంటుంది. చాలామంది డయాబెటిస్ పేషెంట్లకు అంటే దాదాపు 25 శాతం మందికి ఇది పడదు. దీనివల్ల చిన్నపేగులోని కణాలు పాడైపోయి, ఆహార పదార్థాల శోషణ తగ్గిపోతుంది.  అందుకే అనవసరంగా అన్నం మానేసి చపాతీకి మారడం కరెక్ట్ కాదు. అయితే చపాతీలను లెక్కపెట్టుకుని తింటాం కాబట్టి కొంచెం తక్కువ కేలరీలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని అలా చెప్తారు. 

7. అపోహ : చేదు పదార్థాలు తింటే డయాబెటిస్ నివారించొచ్చా?
నిజం – కాకరకాయ రసం, మెంతుల వంటి చేదుగా ఉన్న పదార్థాలు తీసుకుంటే డయాబెటిస్ ను కంట్రోల్ చేయొచ్చని, నివారించొచ్చని అనుకుంటారు. కానీ ఇందులో పెద్దగా నిజం ఏమీ లేదు. చేదుగా ఉన్న వాటిలో ఆల్కలాయిడ్స్ అనే కెమికల్స్ ఉంటాయి. ఇవి ప్రమాదకరం. వీటిని జీర్ణం చేయడానికి జీర్ణాశయం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇందుకోసం జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా తయారవుతుంది. తద్వారా కడుపులో మంట ఎక్కువై అల్సర్లు తయారయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. 

8. అపోహ : ఆయుర్వేదం, హోమియోపతి లాంటి ప్రత్యామ్నాయ వైద్య విధానాలు డయాబెటిస్ ను పూర్తిగా తగ్గిస్తాయా?
నిజం – ఏ వైద్య విధానంలోనూ డయాబెటిస్ ను సమూలంగా తగ్గించే అవకాశం లేదు. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఇంగ్లీషు వైద్యంలో కూడా కొన్ని రకాల ప్రత్యామ్నాయ వైద్య విధానంలో వాడే మందుల నుంచి సేకరించిన పదార్థాల నుంచే డయాబెటిస్ మెడిసిన్స్ తయారుచేశారు. కాబట్టి అల్లోపతి లో లేని మెడిసిన్స్ ఏవీ ఇతర వైద్య విధానాల్లో లేవు. ఆయుర్వేదం, యునాని, హోమియోపతిల ద్వారా డయాబెటిస్ ను పూర్తి స్థాయిలో నయం చేయడానికి అవకాశం లేదు. కాని కొంతవరకు కంట్రోల్ చేయవచ్చు. డయాబెటిస్‌ను తగ్గించే వైద్య విధానం ఏదీ లేదు.