Blood Pressure : అందుబాటులో ఉండే ఈ ఐదు మూలికలతో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది తెలుసా!
తెల్ల మద్దిగా పిలవబడే ఈ అర్జున చెట్టు బెరడులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. క్యాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలు, ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తాయి. అర్జున వృక్షం బెరడులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి.
Blood Pressure : హైబీపీ సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది బాధ పడుతున్నారు. రక్తపోటు ఎప్పటికప్పుడు మారుతుంది, వేర్వేరు సాధారణ రోజువారీ కార్యకలాపాలతో ఇది ముడిపడి ఉంటుంది. రక్తపోటు రాత్రి కంటే పగటిపూట ఎక్కువగా ఉంటుంది మరియు వేసవి కంటే శీతాకాలంలో ఎక్కువగా ఉంటుంది. యుక్తవయస్సులో, బరువు మరియు రక్తపోటు దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. బరువు పెరిగినప్పుడు, రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు స్థాయిలు ఎక్కువగా ఉంటే, గుండె జబ్బులు, గుండెపోటు మరియు స్ట్రోక్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు ఎక్కువ ప్రమాదం ఉంది. చాలా మంది వైద్యులు 140/90 మరియు అంతకంటే ఎక్కువ రక్తపోటును ఎక్కువగా భావిస్తారు.
అధిక రక్తపోటుతో బాధపడేవారిలో తీవ్రమైన తలనొప్పి, అలసట, మసక దృష్టి, ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హృదయ స్పందనలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తోంది. హైబీపీ వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. మనకు అందుబాటులో ఉండే సహజ సిద్ధమైన ఔషదగుణాలు కలిగిన వనమూలికలతో రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
1. తులసి : హిందువులు తులసి చెట్టును పవిత్రంగా పూజిస్తుంటారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. రోజూ పరగడుపునే ఐదారు తులసి ఆకులను అలాగే నమిలి మింగాలి. లేదా తులసి ఆకులతో టీ తయారు చేసుకుని కూడా తాగవచ్చు. తులసి ట్యాబ్లెట్లు కూడా మనకు లభిస్తాయి. వీటిని కూడా వాడుకోవచ్చు. తులసి ఆకుల్లో ఉండే యుజినాల్ అనబడే సమ్మేళనం హైబీపీని తగ్గిస్తుంది. తులసిని వాడడం వల్ల శ్వాసకోశ సమస్యలు కూడా తగ్గుతాయి.
2. ఉసిరి : ఉసిరికాయ ఎన్నో ఔషధ విలువలు కలిగింది ఉంటుంది . విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉన్న ఫలం ఈ ఉసిరి మన ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. తల వెంట్రుకల మొదలు కాలి గోల్లు వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణిగా చెప్పవచ్చు. నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒక పెద్ద ఉసిరికాయను తినాలి. లేదా ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల ఉసిరికాయ రసాన్ని కలుపుకుని తాగవచ్చు. ఉసిరి ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. ఎండు ఉసిరికాయల పొడి కూడా లభిస్తుంది. వీటిల్లో దేన్నయినా ఉపయోగించవచ్చు. ఉసిరికాయ పొడిని వాడితే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల పొడిని కలుపుకోవాల్సి ఉంటుంది. ఉసిరికాయలను వాడడం వల్ల హైపీబీ సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది. దీని వల్ల రక్తనాళాలు వెడల్పు అవుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
3. అశ్వగంధ : ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 1 టీస్పూన్ అశ్వగంధ పొడి కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగాలి. ఇలా చేయడం వల్ల బీపీ త్వరగా అదుపులోకి వస్తుంది. అశ్వగంధ చూర్ణంతో తయారు చేసిన ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. వీటిని ఉదయం సాయంత్రం భోజనం చేశాక తీసుకోవచ్చు. మార్కెట్లో మనకు 250ఎంజీ, 500ఎంజీ మోతాదులో ఈ ట్యాబ్లెట్లు లభిస్తాయి. అయితే ముందుగా 250 ఎంజీ మోతాదుతో ప్రారంభించవచ్చు. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున వాడుతూ సమస్యకు అనుగుణంగా మోతాదును పెంచవచ్చు. అయితే ఈ ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయినప్పటికీ వైద్య సలహా మేరకు వాడుకుంటే మంచిది.
4. అర్జున : తెల్ల మద్దిగా పిలవబడే ఈ అర్జున చెట్టు బెరడులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. క్యాల్షియం, అల్యూమినియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలు, ఆస్తమా వంటి వ్యాధులను తగ్గిస్తాయి. అర్జున వృక్షం బెరడులో యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ బెరడును ఎన్నో ఔషధాల తయారీలో వాడుతారు. గుండె ఆరోగ్యానికి అర్జున బెరడు అద్భుతంగా పనిచేస్తుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. హైపీబీ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అర్జున బెరడు చూర్ణం మనకు మార్కెట్లో లభిస్తుంది. బెరడును కూడా నేరుగా కొనుగోలు చేయవచ్చు. దాన్ని చూర్ణం చేసుకుని ఉపయోగించవచ్చు. ఒక గ్లాస్ నీటిలో 1 టీస్పూన్ అర్జున బెరడు చూర్ణం కలిపి ఉదయం, సాయంత్రం భోజనం చేశాక తీసుకుంటే ఫలితం ఉంటుంది. అర్జున ట్యాబ్లెట్లు కూడా లభిస్తాయి. వాటిని కూడా వాడుకోవచ్చు.
5. త్రిఫల : త్రిఫల అనేది ఓ ప్రాచీన ఔషదం. దీనిలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలున్నాయి. అందువల్ల దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఉసిరికాయ, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణాన్ని వాడడం వల్ల అందులో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు హైబీపీని తగ్గిస్తాయి. రోజూ రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో 2 టీస్పూన్ల త్రిఫల చూర్ణాన్ని కలుపుకుని తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. జీర్ణ సమస్యలు కూడా ఉండవు. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది.