Migraine : మైగ్రేన్ బాధిస్తుంటే… ఇలా చేసి చూడండి..

వైద్యుల సూచనలు పాటించటంతోపాటు కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పి నుండి సులభంగా విముక్తి పొందవచ్చు. ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతోపాటు నిత్యం వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేస్తుండాలి

 Migraine : మైగ్రేన్ బాధిస్తుంటే… ఇలా చేసి చూడండి..

Migraine

Migraine : తల పగిలిపోతుందా అన్నట్లుగా, నరాలు చిట్లిపోతున్నాయా అనేంతలా భాదించే తలనొప్పితో చాలా మంది బాధపడుతుంటారు. దీనినే మైగ్రేన్ అంటారు. సాధారణంగా తలనొప్పి చాలా మందిలో అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇది వచ్చిన గంట రెండు గంటల వ్యవధిలోనే తగ్గిపోతుంటుంది. దీనికోసం పెద్దగా చేయాల్సింది ఏమి లేదు. ఓ కప్పు టీ, లేదా కాఫీ, టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది.

కానీ మైగ్రేన్ తరుచుగా వస్తూ గంటల తరబడి తగ్గకుండా వేధిస్తుంటుంది. ప్రస్తుతం బిజీ జీవనశైలిలో ఒత్తిడి, నిద్రలేమి, ప్రశాంతత లేకపోవడం వంటి కారణాలతో చాలామంది మైగ్రేన్ తలనొప్పితో ఇబ్బందిపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. మైగ్రేన్ నొప్పి సమయంలో వెలుతురును చూడలేకపోవటం, శబ్ధాలను భరించకపోవటం, చికాకు, కంటి చూపు తగ్గటం ఇలా అనేక లక్షణాలు ఈ మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు అనుభవిస్తుంటారు.

ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది తీవ్రమైన అలసటకు గురిచేయటం తోపాటు దీర్ఘకాలికంగా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి వచ్చే ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కళ్లముందు జిగ్ జాగ్ లైన్లు కనిపించటం, కళ్ళల్లో నీళ్ళు రావటం, చెవులలో శబ్ధాలు, కళ్ళు ఎర్రబడటం వంటివి మైగ్రేన్ తలనొప్పికి సూచనలు.

వైద్యుల సూచనలు పాటించటంతోపాటు కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే ఈ నొప్పి నుండి సులభంగా విముక్తి పొందవచ్చు. ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతోపాటు నిత్యం వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేస్తుండాలి. వత్తిళ్లు, ఆందోళనలను తట్టుకునేందుకు యోగా, ప్రాణాయామం చేయటం ఉత్తమం, మద్యం, పొగ వంటి అలవాట్లను మానుకోవాలి. మైగ్రేన్ తో బాధపడేవారు చీకటి గదిలో చల్లని వాతావరణంలో సేదతీరాలి. లక్షణాలను బట్టి వైద్యులు సూచించిన విధంగా మందులు వేసుకోవాలి. ఛీజ్, నట్స్, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రతిరోజు 8గంటల పాటు ప్రశాంతం నిద్రపోవాలి. గొరు వెచ్చని నీటితో స్నానం చేసి మానసిక వత్తిడిని తగ్గించుకోవాలి.

ప్రతిరోజు మూడు లీటర్లకు పైగా మంచినీరు తాగాలి. ఇలా చేస్తే మైగ్రేన్ సమస్యకు మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి నొప్పులకు మలబద్ధకం సమస్య కూడా కారణం కావచ్చు. నీరు ఎక్కువగా తీసుకోవటం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోయి మైగ్రేన్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. అల్లం, తులసి, పుదీనాతో కషాయం చేసుకుని తాగితే మైగ్రేన్ నుండి ఉపశమనం పొందవచ్చు. ప్రతిరోజు తులసి ఆకులను నమిలినా కొంత మేర ఫలితం ఉంటుంది.