Diet : వయస్సు 30 దాటిందా?…తీనే ఆహారంలో జాగ్రత్తలు తప్పనిసరి..
చియా సీడ్స్లో అద్భుతమైన ఔషధగుణాలు, పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువును, షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి.
Diet : వయస్సు 30 ఏళ్లు దాటిన వారు ఆహారంలో సరైన సమతుల్యతను పాటించటం ఎంతో అవసరం. జీవక్రియ మార్పుల వల్ల పోషకాహారం చాలా అవసరం. ఆరోగ్యకరమైన కొవ్వును ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. అందుకే సరైన సమతుల ఆహారాన్ని డాక్టర్ల ద్వారా తెలుసుకుని తీసుకోవటంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మహిళలు. హడావుడిగా ఏదో ఒకటి తిని కడుపు నింపుకోవడం కాకుండా ఏం కావాలో అది మాత్రమే తినాలన్న నియమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించాలి.
పుదీనా కొత్తిమీర కరివేపాకు, మెంతి ఆకు, తదితరాలను వంటకాల్లో ఎక్కువగా చేర్చండి. అవి ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాదు తక్కువ కెలోరీలు అందిస్తాయి.ఒకే సారి ఎక్కువగా తినకుండా ప్రతిరెండు మూడు గంటలకోసారి కొద్ది కొద్దిగా ఆహారం తీసుకోవాలి. అన్నిటికంటే మించి వండే వంటకాల్లో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వాటర్ తరచు తాగుతుండాలి. పండ్లు, వేయించిన వేరుశనగలు, మొలకెత్తిన గింజలు, నువ్వులు, అవిసెలు, రాగులు వంటి గింజలు తినాలి. ఆహారంలో మంచి ఫైటోన్యూట్రియెంట్స్, మంచి యాంటీఆక్సిడెంట్లను తీసుకోవాలి. ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి అలాగే మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
30 తరువాత హార్మోన్లలో మార్పులొస్తాయి. దీంతో ఎముకలు గుల్లబారతాయి. కాబట్టి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. అలాగే బీపీ, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధులను దూరంగా ఉంచడానికి..అన్ని పోషకాలను కలిగి ఉండే సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. వీటితోపాటు మానసిక సంఘర్షలు వస్తాయి. కాబట్టి ఆహారంలో మార్పులు అనివార్యం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా తృణధాన్యాలు తీసుకుంటే చక్కటి పోషకాలు అందుతాయి.వాటిలో మంచి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. నువ్వులు, అవిసెలు,గుమ్మడి గింజలు, చియా గింజలు తీసుకోవాలి.అవోకాడో,బెర్రీలతో సహా పండ్లు, కూరగాయలు తినాలి.
వయస్సు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీరంలో ఉత్తేజం తగ్గుతుంది. ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసేవారికైతే అనారోగ్య సమస్యలు ముప్పేట దాడి చేస్తుంటాయి. అందువల్ల వయస్సు పైబడుతున్న వారు కచ్చితంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు వచ్చిన వారు రోజూ తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది.
వయస్సు 30 ఏళ్లు దాటిన తరువాత స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ శృంగారం పట్ల వ్యామోహం క్రమంగా తగ్గుతుంటుంది. కనుక శృంగారంలో చురుగ్గా పాల్గొనాలన్నా.. చురుగ్గా పనిచేయాలన్నా.. రోజూ అశ్వగంధను తీసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడవచ్చు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది.
వయస్సు 30 ఏళ్లు దాటిన వారు రోజూ మచా టీని తాగాలి. దీన్ని సూపర్ఫుడ్గా పరిగణిస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఒక టీస్పూన్ మచా టీ పొడితో టీ తయారు చేసుకుని తాగితే పాలకూర కన్నా 60 రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.
చియా సీడ్స్లో అద్భుతమైన ఔషధగుణాలు, పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువును, షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. చియా సీడ్స్ లాగే అవిసె గింజలు కూడా పనిచేస్తాయి. వీటిని కూడా రోజూ గుప్పెడు మోతాదులో తినవచ్చు. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్, జీర్ణ సమస్యలు రాకుండా చూస్తాయి. ఈ గింజలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
క్వినోవాను సూపర్ ఫుడ్గా పిలుస్తారు. 30 ఏళ్లకు పైబడిన వారు దీన్ని రోజూ తింటే జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. క్వినోవాలో ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ ను తగ్గించి బరువును అదుపులో ఉంచుతాయి.
రోజూ గుప్పెడు మోతాదులో బాదం పప్పును నానబెట్టి తినాలి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, మినరల్స్ ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతాయి. రోజుకు పది బాదంపప్పును తినాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.