Covid Pandemic India : మూడో ముప్పు ముంగిట్లో భారత్!
దేశంలో డెల్టా వేరియంట్, కరోనా మ్యుటేషన్లతో భారత్లో మూడో ముప్పు పొంచి ఉందంటూ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా వెల్లడించింది. రోజూవారీ కరోనా కొత్త కేసులను పరిశీలిస్తే.. మూడో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.
3rd wave of Covid pandemic in India : దేశంలో డెల్టా వేరియంట్, కరోనా మ్యుటేషన్లతో భారత్లో మూడో ముప్పు పొంచి ఉందంటూ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ సెక్యూరిటీస్ ఇండియా వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడం కారణంగా దేశంలో మూడో ముప్పు ఆందోళన కలిగిస్తోందని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్ధికవేత్త తన్వీ గుప్తా జైన్ తెలిపారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మూడో ముప్పు పొంచి ఉందనడానికి సంకేతాలుగా చెబుతున్నారు. రోజూవారీ కరోనా కొత్త కేసులను పరిశీలిస్తే.. మూడో ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మందకొడిగా సాగడం మరింత ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. జూన్లో రోజుకు సగటున 40 లక్షల వ్యాక్సిన్ డోసులు అందాయి.
జూలై 12నాటికి మాత్రం 34 లక్షలకు పడిపోయిందని పేర్కొంది. వ్యాక్సిన్ల కొరత కూడా కరోనా కేసుల పెరుగుదలకు దారితీస్తుందని నివేదిక వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 22.7 శాతం మంది తొలిడోసు తీసుకున్నారు. కేవలం 5.4 శాతం జనాభానే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు నివేదిక వెల్లడించింది.
మరోవైపు.. దేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో భారత్లో 41,806 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,09,87,880 కు చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇదే సమయంలో 581 కొత్త మరణాలు నమోదుకాగా.. మరణించిన వారి సంఖ్య 4,11,989కు చేరింది. గత 24 గంటల్లో దేశంలో 39,130 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ కాగా.. మొత్తం రికవరీల సంఖ్య 3,01,43,850 కు చేరింది.