మిమ్మల్ని మిస్ అవుతున్నా.. రక్త దానం చేయండి.. ప్రాణ దాతలు కండి..
మిమ్మల్నందర్నీ మిస్ అవుతున్నా.. అతిత్వరలోనే అందరం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నా- మెగాస్టార్ చిరంజీవి..
మిమ్మల్నందర్నీ మిస్ అవుతున్నా.. అతిత్వరలోనే అందరం మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నా- మెగాస్టార్ చిరంజీవి..
కరోనా ఎఫెక్ట్తో ప్రస్తుతం దేశమంతా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో మిగతా రంగాలతో పాటు సినిమా రంగం కూడా మూతపడడం, పలు సినిమాల షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో స్టార్స్ అందరూ కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. కాగా ఇటువంటి సమయంలో పనుల్లేక, తినడానికి తిండి లేక ఎందరో రోజు వారీ సినిమా వర్కర్లు పడుతున్న అవస్థను గమనించి ఇటీవల టాలీవుడ్ ప్రముఖులతో కరోనా విపత్తు నిధి పేరిట ఒక సంస్థను నెలకొల్పి, తాను సహా పలువురి నుండి విరాళాలు సేకరించి, తద్వారా నిత్యం ఎందరో కార్మికులకు భోజనం, సరుకులు అందిస్తున్నారు మెగాస్టార్.
తాజాగా తన తల్లి, తమ్ముళ్లు, అక్క, చెల్లెళ్లతో కలిసి గతంలో దిగిన ఫోటోని తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఈ లాక్డౌన్ సమయంలో వారందరినీ మిస్ అవుతున్నాను, అతి త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడి మనం అందరం మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాను అంటూ ఒక పోస్ట్ చేశారు. కాగా ఆ పోస్ట్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది..
అలాగే రక్తం అవసరం పడేవారికి లాక్డౌన్ పెను సమస్యగా మారింది. బ్లడ్ బ్యాంక్స్లో రక్త నిల్వలు అడుగంటడంతో ఆస్పత్రి వర్గాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రజలు, అభిమానులు విరివిగా రక్తదానం చేయాలని అందుకు సమీప బ్లడ్ బ్యాంక్స్కి వెళ్లాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నిర్వహించిన రక్తదానం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు. చిరంజీవితో సహా హీరో శ్రీకాంత్, రోషన్ (శ్రీకాంత్ తనయుడు), శ్రీమిత్ర చౌదరి.. వారి వారసులు తేజ్ నివాస్, తేజ్ గోవింద్, బెనర్జీ, నటుడు భూపాల్, గోవిందరావు, విజయ్, సురేష్ కొండేటి తదితరులు కూడా రక్తదానం చేసిన వారిలో ఉన్నారు.