ప్రభాస్ సినిమా షూటింగ్ ల్లో ప్రమాదాలు..ఫ్యాన్స్ ఆందోళన
Prabhas : యంగ్ రెబల్స్టార్ ప్రభాష్ …సినిమా షూటింగ్ల్లో అపశృతులు కలకలం రేపాయి. రెండు సినిమా యూనిట్లలో ప్రమాదాలు ఆయా చిత్ర నిర్మాతలను ఉలిక్కిపడేలా చేశాయి. ఒకే రోజు జరిగిన రెండు ప్రమాదాలతో అభిమానులు ఆందోళన చెందారు. బాహుబలి ఫేమ్తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రభాష్ .. కొత్తగా ఆది పురుష్, సలార్ చిత్రాల్లో నటిస్తున్నారు. ముంబైలోని గోరెగావ్లోని ఫిల్మ్ స్టూడియోలో ఆది పురుష్ మూవీ కోసం భారీ సెట్ వేశారు. షూటింగ్ మంగళవారం ఆరంభమైంది. అయితే కాసేపటికే స్టూడియోలో మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లోనే ఉవ్వెత్తున ఎగబాకాయి. దీంతో యూనిట్ సభ్యులంతా పరుగులు దీశారు.
ఎనిమిది ఫైరింజన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. గంటల తరబడి నీళ్లు చల్లి మంటల్ని ఆర్పివేశారు అగ్నిమాపక సిబ్బంది. అయితే భారీగా మంటలు చెలరేగడంతో సెట్ చాలావరకు దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడంతో చిత్ర యూనిట్ ఊపిరిపీల్చుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తోనే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మంటలు చెలరేగినప్పుడు ప్రభాష్, సైఫ్ అలీఖాన్ లేరని చిత్ర బృందం తెలిపింది. రామాయణం కథాంశంగా..బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో… రాముడిగా ప్రభాస్, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటించనున్నారు. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కనుంది.
మరోవైపు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో రాజీవ్ రహదారిపై చిత్ర యూనిట్ వెళ్తున్న వ్యాన్ను లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో వాహనం దెబ్బతింది. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన క్షతగాత్రులంతా…తాము బసచేస్తున్న హోటల్కు వెళ్లిపోయారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కతున్న సలార్ సినిమా షూటింగ్ ఇటీవలే రామగుండంలో ప్రారంభమైంది. ఒకే రోజు వరుస ప్రమాదాలతో ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందారు.