లాక్‌డౌన్‌లో స్నేహితుడితో కలిసి జాలీరైడ్.. యాక్సిడెంట్ చేసి పరారీ..

నటి షర్మిలా మాండ్రే తన స్నేహితుడితో కలిసి జాలీ రైడ్‌కెళ్లగా యాక్సిడెంట్ జరిగింది..

  • Published By: sekhar ,Published On : April 5, 2020 / 10:44 AM IST
లాక్‌డౌన్‌లో స్నేహితుడితో కలిసి జాలీరైడ్.. యాక్సిడెంట్ చేసి పరారీ..

నటి షర్మిలా మాండ్రే తన స్నేహితుడితో కలిసి జాలీ రైడ్‌కెళ్లగా యాక్సిడెంట్ జరిగింది..

కరోనా వైరస్‌తో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలులో ఉన్న సమయంలో కుదురుగా ఇంట్లో ఉండకుండా  తన స్నేహితుడితో కలిసి ఖరీదైన కారులో జాలీరైడ్‌కు వెళ్లి ప్రమాదానికి గురైంది కన్నడ నటి షర్మిలా. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ నటి షర్మిలా మాండ్రే  ఆమె స్నేహితుడి లోకేష్ వసంత్‌తో కలిసి శనివారం(ఏప్రిల్ 4) తెల్లవారుజామున మూడు గంటల సమయంలో తన జాగ్వర్‌ కారులో జాలీ రైడ్‌కు బయలుదేరింది. బెంగుళూరులోని వసంతనగర్‌లో కారును అతి వేగంతో నడపడంతో అదుపుతప్పి అండర్‌పాస్‌ పిల్లర్‌ను ఢీకొట్టింది.

దీంతో షర్మిల ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమె స్నేహితుడికి కాలు విరిగింది.  వీరిద్దరూ పోర్టిస్ ఆసుపత్రిలో ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని వెళ్లిపోయారు. కాగా లాక్‌డౌన్‌ సమయంలో బాధ్యతను విస్మరించిన షర్మిల చర్యలను పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు. ‘సీట్‌ బెల్ట్‌ వేసుకోని కారణంగా ఎయిర్‌ బ్యాగ్‌ తెరుచుకోలేదు. లాక్‌డౌన్‌ నియమాలను ఉల్లంఘించి ఇంటి నుండి బయట రావటమే తప్పు. పైగా ఆసుపత్రి నుండి పరారీ కావటం మరో తప్పు’ అని విమర్శిస్తున్నారు.

కాగా షర్మిల, ఆమె స్నేహితుడు తాగి డ్రైవింగ్‌ చేశారా లేక వేగంగా వెళ్లి ఢీకొన్నారా? ప్రమాద సమయంలో ఎవరు డ్రైవింగ్‌ చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హైగ్రౌండ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు. మరోవైపు షర్మిలపై జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కూడా ఫిర్యాదు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసు జాయింట్ పోలీస్ కమిషనర్ రవికాంతె గౌడ తెలిపారు. తెలుగులో అల్లరి నరేష్ సరసన ‘కెవ్వుకేక’ సినిమాలో నటించింది షర్మిలా మాండ్రే..

Read Also : కరోనాతో మోహన్ లాల్ మరణించాడంటూ ఫేక్ న్యూస్.. రంగంలోకి దిగిన పోలీసులు..