సినీ నటి వాణిశ్రీ ఇంట్లో తీవ్ర విషాదం

  • Published By: naveen ,Published On : May 23, 2020 / 06:01 AM IST
సినీ నటి వాణిశ్రీ ఇంట్లో తీవ్ర విషాదం

టాలీవుడ్ సీనియర్‌ నటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె కుమారుడు డాక్టర్ అభినయ్‌ వెంకటేశ్‌(36) కన్నుమూశాడు. చెన్నైలోని తన నివాసంలో శనివారం(మే 23,2020) తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడు గుండెపోటు రావడంతో అభినయ్‌ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్‌ కాలేజీలో మెడిసిన్‌ పూర్తి చేసిన అభినయ్ కు భార్య, కుమారుడు(4) ఉన్నారు. అభినయ్ భార్య కూడా డాక్టరే. కొడుకు అకాల మరణాన్ని వాణిశ్రీ తట్టుకోలేకపోతున్నారు. ఆమె శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆమె వయసు 71 ఏళ్లు. వాణిశ్రీకి కుమారుడు, కుమార్తె సంతానం. వాణిశ్రీ కుమారుడు హఠాన్మరణంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. వాణిశ్రీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. అభినయ్ అంత్యక్రియలు ఇవాళ జరుగుతాయని కుటుంబసభ్యులు చెప్పారు.

అభినయ్ భార్య కూడా డాక్టర్:
ఊటీలో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్న అభినయ్.. ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్‌పట్టుకు వెళ్లారని సన్నిహితులు తెలిపారు. రాత్రి తన కుమారుడితో సరదగా గడిపిన వెంకటేశ్.. ఉదయం విగతజీవుడిగా మారారని సన్నిహితులు వాపోయారు. అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తీసుకురావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అభినయ్ భార్య కూడా డాక్టరే. ఆమె సావిత్రి మనవరాలి ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమను ఏలిని కళాభినేత్రి:
70, 80వ దశకాల్లో తెలుగు చిత్ర సీమలో కథానాయికగా ఓ వెలుగు వెలిగారు కళాభినేత్రి వాణిశ్రీ. తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ తన ప్రతిభ చూపించారు. తెలుగు అగ్రశ్రేణి నటిగా వెలుగొందారు. ఫ్యామిలీ డాక్టర్ నే ఆమె పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సినీ రంగం నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత అత్త, తల్లి పాత్రలు వేస్తూ మళ్లీ వెండి తెర మీద కనిపించారు. వాణిశ్రీ పిల్లలు మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు.