యూట్యూబర్‌పై అక్షయ్ ఆగ్రహం, రూ. 500 కోట్ల పరువు నష్టం నోటీసు

  • Published By: madhu ,Published On : November 20, 2020 / 02:46 AM IST
యూట్యూబర్‌పై అక్షయ్ ఆగ్రహం, రూ. 500 కోట్ల పరువు నష్టం నోటీసు

Akshay Kumar serves Rs 500-cr defamation notice : యూ ట్యూబర్ పై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేసినందుకు రూ. 500 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుతో సంబంధం ఉందంటూ..తనపై ఫేక్ వార్తలను ప్రచారం చేశాడని అక్షయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బీహార్ రాష్ట్రానికి చెందిన సిద్దిఖీ యూ ట్యూబర్ కు పరువునష్టం నోటీసు ఇచ్చారు.



పరువు నష్టం కలిగించే, అవమానకరమైన వీడియోలను సిద్ధిఖీ అప్ లోడ్ చేశాడని వెల్లడించారు. సుశాంత్ కేసుతో అక్షయ్ ను ముడిపెడుతూ..సిద్దిఖీ (FF News) పలు వీడియోలు చేశాడు. అక్షయ్, ఆదిత్య థాక్రే, ముంబై పోలీసులతో రహస్య సమావేశాలు జరిపారని ఆరోపిస్తూ..ఓ వీడియో పోస్టు చేశాడు. అంతేగాకుండా..సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కెనాడాకు పారిపోవడానికి అక్షయ్ సహాయం చేశాడంటూ మరో వీడియో చేశాడు.



ఇలాంటి వీడియోలు చేయడం వల్ల సిద్ధిఖీ ఒక్కసారిగా ఫేమస్ గా మారిపోయాడు. ఈ వీడియోల ద్వారా..భారీగానే డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలన్నీ తప్పుడవని, నిరాధారమైనవని అక్షయ్ తరపు న్యాయవాది నోటీసులో వెల్లడించారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, బేషరతుగా క్షమాపణలు చెబుతూ, వెంటనే..వీడియోలు తొలగించాలని భవిష్యత్ లో ఇలాంటి వీడియోలు అప్ లోడ్ చేయకుండా ఉండాలని సూచించారు.



మూడు రోజుల వ్యవధిలో సిద్ధిఖీ స్పందించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. దీంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధిఖీ బేషరతుగా క్షమాపణలు కోరినట్లు సమాచారం. ఛానెల్ నుంచి అభ్యంతకరమైన వీడియోలను తొలగించారని తెలుస్తోంది.
రాజ్ పుత్ జూన్ 14వ తేదీన బాంద్రా అపార్ట్ మెంట్ లో చనిపోయిన సంగతి తెలిసిందే. హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ కేసులో ఇతని స్నేహితురాలు రియా చక్రవర్తిని అరెస్టు చేసిన సంగతి తెలిసింది. అనంతరం ఆమెకు బెయిల్ లభించింది. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేపడుతోంది.