విడుదల వెండితెర మీదే.. రెండు పండగలకు రెండు సినిమాలు..

  • Published By: sekhar ,Published On : June 30, 2020 / 04:13 PM IST
విడుదల వెండితెర మీదే.. రెండు పండగలకు రెండు సినిమాలు..

రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ కోసం సినీ ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంతో ఆతృత‌గా, ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ క‌రోనా ప్ర‌భావంతో ఈ రెండు సినిమాల విడుద‌ల కాకుండా వాయిదా ప‌డ్డాయి. తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీల‌పై ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ క్లారిటీ ఇచ్చింది. 2020లో దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 13న అక్ష‌య్ హీరోగా న‌టించిన ‘సూర్య‌వంశీ’.. అలాగే క్రిస్మస్ సందర్భంగా డిసెంబ‌ర్‌25న‌ రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘83’ సినిమాను విడుద‌ల చేస్తున్నట్లు రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాషిస్ స‌ర్కార్ తెలిపారు.

ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘నవంబర్ 13న దీపావళికి ‘సూర్యవంశీ’, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ‘83’ చిత్రాలను థియేటర్స్‌లోనే విడుద‌ల చేస్తున్నాం. పరిస్థితులు చక్కబడి ప్రేక్ష‌కులు సినిమా థియేట‌ర్‌కు రావ‌డం ప్రారంభించిన త‌ర్వాతే ‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాల‌ను విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. రానున్న దీపావళి, క్రిస్మస్‌ల‌కు ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌తాయ‌ని ఆశిస్తున్నాం’’ అన్నారు. లాక్‌డౌన్ త‌ర్వాత రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసిన చిత్రాలివే కావ‌డం గ‌మ‌నార్హం.

అక్ష‌య్‌కుమార్‌, క‌త్రినా కైఫ్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్ త‌దిత‌రులు న‌టించిన ‘సూర్య‌వంశీ’ చిత్రాన్ని రోహిత్ శెట్టి డైరెక్ట్ చేశారు. బాలీవుడ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్స్ సింగం, సింబాలుగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ర‌ణ్‌వీర్ సింగ్ ‘సూర్యవంశీ’లో స్పెష‌ల్ అప్పియ‌రెన్స్ ఇవ్వ‌డం విశేషం. మార్చి 27న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అలాగే క‌బీర్‌ఖాన్ తెర‌కెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ‘83’ ఏప్రిల్ 10న విడుద‌ల కావాల్సింది. క‌రోనా ప్ర‌భావంతో ఈ చిత్రం కూడా వాయిదా ప‌డింది. 1983లో క్రికెట్‌లో విశ్వ‌విజేత‌గా ఆవిర్భ‌వించిన ఇండియ‌న్ టీమ్ ప్ర‌యాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇందులో రణ్‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకొనె, తాహిర్ రాజ్ బాసిన్‌, సాధిక్ స‌లీమ్‌, అమ్మి విర్క్‌, పంక‌జ్ త్రిపాఠి, బోమ‌న్ ఇరాని త‌దిత‌రులు న‌టించారు.

Read:రష్మిక ఆవకాయ అదుర్స్ అంటున్న నమ్రత