మరణించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్ ఆర్థికసాయం..

  • Published By: sekhar ,Published On : September 2, 2020 / 12:49 PM IST
మరణించిన పవన్ కళ్యాణ్ అభిమానులకు అల్లు అర్జున్ ఆర్థికసాయం..

Allu Arjun Response about Fans Dies: ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం.. శాంతిపురం మండ‌లం ఏడ‌వ‌మైలు గ్రామంలో అభిమానులు 25 అడుగుల ఎత్తుండే క‌టౌట్ క‌డుతుండగా జరిగిన ప్రమాదంలో పవన్ ఫ్యాన్స్ సోమ‌శేఖ‌ర్‌, అరుణాచ‌లం, రాజేంద్ర అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయారు. విషయం తెలుసుకున్నపవన్ అభిమానుల మృతి ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ అభిమానుల మరణం పట్ల సంతాపం తెలుపుతూ, వారి కుటుంబాలకు ఆర్థికసాయం అందిచనున్నట్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.



‘‘ఊహించని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరణించారనే వార్త వినడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. నా తరఫున మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటిస్తున్నాను. ఈ విషయంలో వాలంటీర్‌గా ఉంటూ వారికి సపోర్ట్ చేస్తున్న అందరినీ అభినందిస్తున్నాను’’ అంటూ బన్నీ ట్వీట్ చేశారు.

మృతుల కుటుంబాలకు రెండేసి లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటిస్తూ, క్షతగాత్రులకు మైరుగైన వైద్యం అందించేలా ఏర్పాట్లు చేయాలని స్థానికి జనసేన నాయకులకు పవన్ సూచించారు.