వర్మపై అమృత తీవ్ర వ్యాఖ్యలు.. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది

వర్మపై అమృత తీవ్ర వ్యాఖ్యలు.. ఆత్మహత్య చేసుకోవాలని అనిపించింది

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటనపై వివాదాలకు కేరాఫ్‌ దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అమృత-మారుతీ రావుల కథతో సినిమాను తెరకెక్కిస్తుండగా.. వర్మ ట్విట్టర్ వేదికగా ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమాకు ‘మర్డర్’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు.

అయితే ఫస్ట్‌లుక్‌పై ప్రణయ్ భార్య అమృత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యదార్థ కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించే వర్మ.. ఈసారి ప్రణయ్, అమృతల ప్రేమ వ్యవహారం, మారుతీరావు చేయించిన పరువు హత్య నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నాడు. తన కథ ఆధారంగా వర్మ తీస్తున్న ‘మర్డర్’ సినిమాపై అమృత భావోద్వేగంగా స్పందించారు.

వర్మ విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని అమృత చెప్పుకొచ్చారు. ప్రేమించిన వ్యక్తికి, కన్న తండ్రికి దూరమైన తన జీవితం తలకిందులైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడమే తప్పా అని ప్రశ్నించారు. ఈ ఒక్క ఘటన వల్ల ఎన్నో చీత్కారాలను ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చారు. ఆత్మగౌరవంతో కాలం వెళ్లదీస్తున్న సమయంలో రాంగోపాల్ వర్మ రూపంలో మరో కొత్త సమస్య వచ్చి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే, దీనిని ఎదుర్కొనే శక్తి తనకు లేదని, ఏడ్చేందుకు కూడా కన్నీళ్లు రావట్లేదన్నారు.

రాంగోపాల్ వర్మ పోస్టర్ విడుదల చేస్తారని తెలిసినప్పటి నుంచి భయంతో వణికిపోయినట్టు చెప్పారు. కొడుకుతో కలిసి ఉన్నంతలో ప్రశాంతంగా బతుకుతున్న తన జీవితాన్ని బజారున పెట్టొద్దని వేడుకున్నారు ఆమె. తమ పేర్లను ఉపయోగించి వర్మ తప్పుడు కథను అమ్ముకోవాలని చూస్తున్నాడని చెప్పుకొచ్చారు. వర్మ లాంటి దర్శకుడు ఇంతటి నీచానికి దిగజారుతాడని ఊహించలేదని అన్నారు.

మహిళను ఎలా గౌరవించాలో నేర్పే తల్లి లేనందుకు వర్మను చూస్తే జాలేస్తోందని అన్నారు. తన కథ ఆధారంగా సినిమా తీస్తున్న వర్మపై కేసు వేయడం లేదని, ఎందుకంటే ఈ నీచ, నికృష్ట, స్వార్థపూరిత సమాజంలో అతడు కూడా ఒకడేనని అన్నారు. ఎన్నో బాధలు అనుభవించిన తనకు ఇది పెద్ద లెక్కలోకి రాదన్నారు.

Read: అమృత -మారుతీ రావుపై ‘వర్మ’ సినిమా..’మర్డర్’‌ ఫస్ట్‌లుక్‌