ఇది ఎమోషనల్ అత్యాచారం.. 143 మంది రేప్ కేసుపై ప్రదీప్ స్పందన..

  • Published By: sekhar ,Published On : August 27, 2020 / 07:05 PM IST
ఇది ఎమోషనల్ అత్యాచారం.. 143 మంది రేప్ కేసుపై ప్రదీప్ స్పందన..

anchor Pradeep Response about allegations: సోషల్ మీడియాలో సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న వార్త వచ్చినా అది నిజమా కాదా అనే కన్ఫర్మేషన్ కూడా చేసుకోకుండా ఒకరినిమించి ఒకరు కామెంట్స్ చేస్తూ వారిని చిత్రహింసలకు గురిచేయడం కరెక్ట్ కాదు అంటూ యాంకర్ ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే..

రాష్ట్రంలో సంచలనంగా మారిన యువతిపై 143 మంది అత్యాచారం కేసులో ప్రముఖ యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పలువర్గాల నుంచి ముఖ్యంగా సోషల్‌ మీడియా వేదికగా యాంకర్‌ ప్రదీప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సోషల్‌ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనను టార్గెట్‌గా చేసుకుని తనకు ఎలాంటి సంబంధంలేని వివాదంలోకి లాగుతున్నారని.. తనను తన కుంటుంబాన్ని ఎంతో మానసిక కుంగుబాటుకు గురిచేస్తున్నారని అన్నారు.

‘‘సోషల్ మీడియాలో నా మీద వస్తున్న ఆరోపణలు ఎంతో బాధపెడుతున్నాయి. సున్నితమైన వివాదంలో నా పేరు పెట్టి ఉద్దేశపూర్వకంగానే అటాక్ చేస్తున్నారు. అవతలి వ్యక్తులు నా పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. మీడియా వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తాను. మీ ఆరోపణల కారణంగా నా కుటుంబం మానసికంగా బలవుతుంది. మమ్మల్ని మానసికంగా మానభంగం చేస్తున్నారు.

బాధితురాలికి న్యాయం జరగాలి కానీ నిజాలు తెలియకుండా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో మెట్టు ఎదిగిన నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు. సోషల్ నెట్ వర్క్‌లో నా పేరు వాడటం చాలామందికి అలవాటుగా మారింది. అనవసరమైన ఆరోపణలతో నా సన్నిహితులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజనిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి.. నేను ఏంటో తెలిసినవాళ్లకు నిజానిజాలేంటో తెలుసు’’.. అని వీడియో ద్వారా వెల్లడించారు ప్రదీప్.