బిగ్‌బాస్: నామినేషన్‌లో ఏడుగురు.. అవుట్ అయ్యేది ఎవరు?

  • Published By: vamsi ,Published On : September 22, 2020 / 08:18 AM IST
బిగ్‌బాస్: నామినేషన్‌లో ఏడుగురు.. అవుట్ అయ్యేది ఎవరు?

బుల్లితెర బిగ్‌బాస్ షో నాల్గవ సీజన్.. నెమ్మదిగా జనాలకు ఎక్కడం ప్రారంభం అయ్యింది. ఐపీఎల్ లాంటి ఈవెంట్లు ఒకవైపు నడుస్తున్నా కూడా బిగ్‌బాస్ క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. కానీ ఈసారి బిగ్ బాస్ చూస్తూ ఉంటే మక్కీకి మక్కీ గత సీజన్‌ను రీమేక్ చేసినట్లుగా అనిపిస్తుంది. కంటెస్టెంట్లు మారారు కానీ, ప్రవర్తన తీరు మాత్రం అదే.. అలా ఎంచుకుని మరి కూర్చినట్లు ఉన్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు.

అప్పుడు బాబా భాస్కర్.. ఇప్పుడు అమ్మ రాజశేఖర్.. అప్పుడు హేమ.. ఇప్పుడు కరాటే కళ్యాణీ.. ఏ మాత్రం తేడాల్లేవ్.. ఒక్క గంగవ్వ మాత్రమే అందరి కంటే కాస్త విభిన్నం.. ఇకపోతే బిగ్‌బాస్ కూడా పెద్దగా థింకింగ్ చెయ్యట్లేదు అనుకుంటా.. కొత్త ఐడియాల్లేవ్.. పాత ఫార్ములలకే కాస్త పాలీష్‌లు చేసి టాస్క్‌లు, ఎలిమినేషన్ ప్రాసెస్‌లు పెట్టేస్తున్నాడు. అలవాటైన ప్రేక్షకులు ఇంతేలే అనుకుని చూస్తున్నాడు.. కొత్తగా ఆలోచించేవారు పక్కదారి పట్టేస్తున్నారు. అందుకే మరి లాంచింగ్ రోజు సూపర్ రేటింగ్స్ వచ్చినా.. వీక్ డేస్‌లో మాత్రం రేటింగ్స్ వీక్‌గానే ఉంటున్నాయి.



ఈసారి బిగ్‌బాస్‌లో మాత్రం కాస్త లవ్ యాంగిల్ వర్క్‌ఔట్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్నాడు బిగ్‌బాస్.. అభిజిత్-మోనాలిక-అఖిల్ మరోవైపు అభిజిత్-హరిక, సుజాత-అభిజిత్, సోహెల్-అరియానా జంట మధ్య లవ్ ట్రాక్స్ కాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి.

ఇక సోమవారం ఎపిసోడ్‌ చూస్తే.. మూడో వారం నామినేషన్‌ ప్రక్రియ కంటెస్టెంట్ల మధ్య హీట్ పెట్టేసింది. ఇంటి సభ్యులందరూ ఒక్కొక్కరూ ఇద్దరిని చొప్పున నామినేట్‌ చేయాలి. ఇందుకు వారు మండుతున్న అగ్నిలో నామినేట్‌ చేయాలి అనుకున్న హౌస్‌మేట్‌ ఫోటోను వేయాలి. అయితే ఈ వారం నోయల్‌ ఇంటి కెప్టెన్‌గా కావడంతో అతన్ని ఎవరూ నామినేట్‌ చేయడానికి వీలులేదు. నోయల్‌ మాత్రం ఒక్కరిని నామినేట్‌ చేయాలి. దీంతో అతడు లాస్యను నామినేట్‌ చేశాడు. అలాగే బింగ్‌బాంబ్‌తో దేవి డైరెక్ట్‌ నామినేట్‌ అయ్యింది.



ఇక మిగిలిన వారిలో మోహబాబ్‌ అరియానా, హారిక ఫోటోలను అగ్నిలో వేయగా, దేవి- అమ్మ రాజశేఖర్‌, కుమార్‌ సాయిల ఫోటోలను అగ్నిలో వేశారు. హారిక- మెహబూబ్‌, సుజాత; అవినాష్‌- మెహబూబ్‌, హారిక; దివి- మోనాల్‌, కుమార్‌; అభిజిత్‌- అరియానా, సుజాత; సాయికుమార్‌- మోహబూబ్‌, అఖిల్‌; గంగవ్వ-మోనాల్, కుమార్‌; మోనాల్‌- దివి, అరియానా; అఖిల్‌- కుమార్‌; సోహైల్‌- అరియానా, కుమార్‌; అమ్మ రాజశేఖర్‌- అరియానా, సాయికుమార్‌; లాస్య- కుమార్‌, అరియానా; అరియానా- మోనాల్‌, మెహబూబ్‌; సుజాత- హారిక, అభిజిత్‌ ఫోటోలను అగ్నిలో వేశారు.



దీంతో ఈ ప్రక్రియలో కుమారసాయి, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్, మెహబూబ్, అరియానా.. అంతకుముందు నామినేట్ అయిన దేవీ, లాస్య మొత్తం ఏడుగురు ఎలిమినేషన్‌కు నామినేట్ అయ్యారు. అందులో అయిదుగురూ ఆడవాళ్లే. అమ్మ రాజశేఖర్ మళ్లీ తప్పించుకున్నారు.. అయితే అందరిలో కుమారసాయికి కాస్త వీక్ ఓటింగ్ వస్తుండగా.. అతనే ఈసారి ఎలిమినేట్ కావచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. ఈ ఏడుగురిలో ఈ వారం వాళ్లు ప్రవర్తించే తీరు.. చేసే పనులు కూడా ఓటింగ్‌పై ప్రభావం చూపవచ్చు. కాబట్టి వేచి చూడాల్సిందే.