బిగ్బాస్: కళ్యాణి కంట కన్నీళ్లు.. గంగవ్వ నవ్వులు.. నామినేషన్లో ఎవరు?
అంచనాలు లేకుండా తెలుగులో బిగ్బాస్ నాల్గవ సీజన్ ఒక్కసారిగా స్టార్ట్ అయ్యింది. కొన్ని కోట్ల మంది హృదయాలను కొల్లగొట్టిన అతిపెద్ద రియాలిటీ షో బిగ్బాస్లో కరోనా భయాలను పక్కన పెట్టి ప్రేక్షకులను అలరిస్తుంది. మొదలైన తొలిరోజే ఆటలో నవరసాలు పలికించేశారు కంటెస్టెంట్లు.
ఇదిలా ఉంటే బిగ్ బాస్లో అసలైన రచ్చ అప్పుడే మొదలైంది. మొదటి రోజే.. కరాటే కళ్యాణి హౌస్లో రచ్చ స్టార్ట్ చెయ్యగా.. జోర్దార్ సుజాతపై మాటల దాడి చేసింది. అనంతరం ఏడుపులు పెడబొబ్బలు.. మిగిలిన కంటెస్టెంట్స్ ఓదార్పులు.. బిగ్బాస్కి కావల్సిన అన్నీ మొదటి రోజే మొదలయ్యాయి.
మొదటి రోజే ఎక్కువగా షో ఎమోషనల్గా నడిచింది. బిగ్బాస్లో సెంటిమెంట్ కాస్త ఎక్కువైంది అనేట్లుగా మొదటి రోజు ఉంది. అప్పుడు హేమ.. ఇప్పుడు కరాటే కళ్యాణి.. పెద్దగా తేడా ఏం లేదు అన్నట్లుగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక గంగవ్వ అయితే చాలా ఎమోషనల్ పర్సన్లా అనిపిస్తుంది. అలాగే తన మాటలతో నవ్విస్తుంది. కళ్యాణి భర్త డైరెక్టర్ సూర్య కిరణ్ అయితే ప్రిపేర్ అయ్యి వచ్చేస్తారు.. అంటూ బిగ్ కామెంట్ ఫస్ట్ రోజే చేసేశారు.
తొలి వారం ఎలిమినేషన్స్ కోసం పెట్టిన నామినేషన్ ప్రక్రియలో కోపాలు కాస్త గట్టిగానే కనిపించాయి. మొదటి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు నామినేట్ చేయాలనుకునే సభ్యుల పేర్లు చెప్పి వాళ్ల ముఖంపైనే తలుపు వేయాలని తొలివారం నామినేషన్స్ ప్రక్రియను బిగ్ బాస్ పెట్టగా.. ఈ వారం నామినేషన్స్లో అభిజీత్, సూర్య కిరణ్, అఖిల్, దివ్య, మెహబూబ్, సుజాత, గంగవ్వ నిలిచారు.
ఈవారం ఎలిమినేషన్లో భాగంగా.. నామినేషన్స్ ప్రక్రియలో ఇద్దరు ఇద్దరు చొప్పున గార్డెన్ ఏరియాలో ఉన్న కిటికీల దగ్గర నిలబడాలని బిగ్ బాస్ కోరారు. మిగిలిన ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఇద్దరిలో ఒకర్ని నామినేట్ చేయాలి. డోర్ క్లోజ్ చేయాలి.
నామినేట్ చేసే సమయంలో గంగవ్వ కాస్త నవ్వులు పూయించింది. అవ్వ ఎవరిని నువ్వు నామినేట్ చేస్తావు అని జోర్దార్ సుజాత, యాంకర్ లాస్య గంగవ్వను అడగగా.. ” యెవ్వలెందుకు మొన్ననే వచ్చిరి. ఆల్లిద్దరూ ఉండనీ” అని గంగవ్వ చెప్పిన సమాధానం ఆమె మనస్తత్వానికి, అమాయకత్వానికి అద్దం పట్టింది. గంగవ్వ సమాధానం విని హోస్లో ఉన్నవాళ్లు అందరూ నవ్వుకున్నారు.