కరోనాపై బ్రహ్మాస్త్రం ప్లాస్మా డొనేషన్.. రాజమౌళి..

  • Published By: sekhar ,Published On : August 18, 2020 / 06:31 PM IST
కరోనాపై బ్రహ్మాస్త్రం ప్లాస్మా డొనేషన్.. రాజమౌళి..

ప్లాస్మా దాతల అభినందన కార్యక్రమంలో సినీ దర్శకుడు రాజమౌళి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పోలీస్ అంటే నేరం జరిగినప్పుడు మాత్రమే వస్తారనే తాను అనుకునే వాడినని, కానీ రక్షక భటులనే పేరును సార్థకం చేసుకుంటున్నారన్నారు. నిజంగా సమాజానికి రక్షణ కల్పిస్తున్నారని ప్రశంసించారు. డ్యూటీలో భాగం కాకపోయినా, సమాజం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారని సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను రాజమౌళి అభినందించారు.

Rajamouli



వాలంటీర్లను, సెలబ్రిటీలను తీసుకొచ్చి.. ఓ వేదిక కల్పిస్తున్నారన్నారు. ఇది చిన్న విషయం కాదని, ఫొటోలు దిగి వెళ్లిపోవడం లేదని, దాని కోసం చాలా కష్టపడుతున్నారన్నారు. ప్లాస్మా దాతలను, కోవిడ్ పేషంట్లను అనుసంధానం చేయడం … రోజుకు 70మంది ప్లాస్మా దాతలను తీసుకురావడం గొప్ప విషయమన్నారు. దాతలు మాట్లాడుతూంటే… నిజమైన యోధులనిపిస్తోందన్నారు. రోజూ చాలా మంది హీరోలను చూస్తుంటానని, ఈరోజు ప్రత్యక్షంగా హీరోలను చూస్తున్నానని అన్నారు. త్వరగా ఇమ్యునిటీ డెవలప్ అయితే.. తానూ ప్లాస్మా డొనేట్ చేస్తా అన్నారు. దాతలతో పాటు కలిసి వారియర్‌ను అవుతానన్నారు. దాతల తల్లిదండ్రులు భయపడుతున్నారని తెలిసిందని, భయపడాల్సిన అవసరం లేదన్నారు.



Rajamouli

అంతా సవ్యంగా జరుగుతుందన్నారు. ప్లాస్మా ఇస్తే.. శక్తి తగ్గుతుందని బాధపడకండని, ఉన్నత ప్రమాణాలతో ప్లాస్మా తీసుకుంటున్నారన్నారు. ‘మీ పిల్లలు హీరోలయ్యే అవకాశాన్ని వదులుకోకండి. అందరం కలిస్తే విజయం సాధించగలం. ప్లాస్మా అనేది బ్రహ్మాస్త్రం. ముందస్తు చర్యలు తీసుకుంటే… ప్రతి రోగిని బాగు చేయగలం. ఇదేమీ బలమైన వైరస్ కాదు. చాలా బలహీనమైనది. ఇంత సేవ చేస్తున్న సజ్జనార్‌కు మరింత మద్దతు తెలుపుదాం’ అని రాజమౌళి అన్నారు. కీరవాణి సతీమణి శ్రీవల్లి, రాజమౌళి సతీమణి రమా రాజమౌళి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.