ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘జోడీ’: దర్శకులు విశ్వనాథ్

  • Published By: vamsi ,Published On : September 1, 2019 / 08:13 AM IST
ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘జోడీ’: దర్శకులు విశ్వనాథ్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అంతా కొత్త సినిమా దర్శకుల హవానే నడుస్తుంది. కొత్త దర్శకులు కొత్త తరహా కథలతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ లు కొడుతున్నారు. ఈ క్రమంలోనే `జోడి` సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెడుతున్న కొత్త దర్శకులు విశ్వనాథ్ అరిగెల. ఆది హీరోగా `జెర్సీ` ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా త్వరలో విడుదలకు సిద్ధమైన సినిమా `జోడి`. 2004లో సినిమా రంగంలోకి వ‌చ్చిన విశ్వనాథ్.. 2010లో సినిమాలకు దూరమై సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా మారారు. కానీ సినిమాల మీద మక్కువతో మళ్లీ తనకు ఇష్టమైన ప‌రిశ్ర‌మ‌లో తన సత్తా చాటాలనే ఉద్ధేశ్యంతో 2013లో మళ్లీ సినిమాల్లోకి వచ్చాడు.

రాజ్ తరుణ్ హీరోగా చేసిన `సినిమా చూపిస్తా మావ` సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్.. సొంతంగా డైరెక్ట్ చేయాలని స్క్రిప్ట్ రాసుకొని విజయ్ దేవరకొండకు క‌థ‌ చెప్పాడు. అప్పటికి విజయ్ దేవరకొండ ”పెళ్లి చూపులు” మూవీ కూడా విడుదల కాలేదు. తరువాత కొన్ని కారణాల వల్ల విజయ్ దేవరకొండతో సినిమా కుదరలేదు. అయితే తనను డైరెక్టర్ గా మొదట బాగా నమ్మింది మాత్రం విజయ్ దేవరకొండనే అని చెబుతున్నారు దర్శకులు విశ్వనాథ్. దేవ‌ర‌కొండ కారణంగానే జోడి నిర్మాతను కలుసుకోగా ఆయన ద్వారా అన్నీ కలిసొకచ్చి చివరకు ఆదితో సినిమా తీసినట్లు చెప్పారు దర్శకులు విశ్వనాథ్.

ఈ సినిమా ముగ్గురి నమ్మకంతో ముందుకు కదిలి ఇప్పుడు రిలీజ్ వరకూ వచ్చింది. అందులో ఒకరు ప్రొడ్యూసర్ విజయలక్ష్మిగారు కథ వినగానే అందులోని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. మరొకరు యుటర్న్, జెర్సీ సినిమాలతో సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన  శ్రద్ధా శ్రీనాథ్.. కథ వినగానే మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం అని అన్నారు. మేకింగ్ సమయంలో ఎన్ని అవాంతరాలొచ్చినా సపోర్ట్ గా నిలబడ్డారు. మరొకరు హీరో ఆది, ఆయన సినిమాలోనే కాదు నిజజీవితంలో కూడా హీరోనే అని చెప్పారు. కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుందనే నమ్మకంతో తీసిన సినిమా ‘జోడి’ అని దర్శకులు వెల్లడించారు.

ఆగస్ట్ 29వ తేదీన విడుదలైన జోడీ ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకోగా.. ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై బాగా బజ్ క్రియేట్ అయ్యింది. జోడీ సినిమా సెప్టెంబర్ 6వ తేదీన విడుదలకు సిద్ధం అయ్యింది. జోడి సినిమా కుటుంబ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని, ఇటీవలికాలంలో ఇటువంటి సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, ఆ కోవలోనే జోడీ సినిమా కుడా తప్పక హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు దర్శకులు విశ్వనాథ్.