లతా మంగేష్కర్ పాడిన మూడు తెలుగు పాటలు ఇవే..

  • Published By: sekhar ,Published On : September 28, 2020 / 02:22 PM IST
లతా మంగేష్కర్ పాడిన మూడు తెలుగు పాటలు ఇవే..

Lata Mangeshkar Telugu Songs: ఏడు దశాబ్దాలకు పైగా తన పాటలతో వివిధ భాషల ప్రేక్షకులను అలరించారు మెలొడీ క్వీన్ లతా మంగేష్కర్.. సెప్టెంబర్ 28కి ఆమె 91వ ఏట అడుగుపెడుతున్నారు. లతా మంగేష్కర్
గాత్రం అమృతంలా ఉంటుంది. ఆమె చేత పాటలు పాడించుకోవాలని కోరుకోని సంగీత దర్శకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.


దాదాపుగా అన్ని భాషల్లోనూ ఆమె పాటలు పాడారు. తన కెరీర్‌లో 20 భారతీయ భాషల్లో దాదాపు 26వేలకు పైగా పాటలు పాడారు. వాటిలో ఎక్కువగా హిందీ పాటలే ఉన్నాయి. కానీ తెలుగులో ఆమె కేవలం మూడంటే మూడు పాటలే పాడటం మన దురదృష్టం అనే చెప్పాలి. తెలుగులో ఆమె ఎక్కువ పాటలు పాడకపోవడానికి కారణం ఏంటనేది మాత్రం తెలియదు.


1955లో ఏఎన్నార్, సావిత్రి నటించగా.. సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించిన ‘సంతానం’ చిత్రంలో ‘నిదురపోరా తమ్ముడా’ లతాజీ పాడిన తొలి తెలుగు పాట. తర్వాత 1965లో ఎన్టీఆర్, జమున నటించిగా సాలూరి రాజేశ్వరరావు కంపోజ్ చేసిన ‘దొరికితే దొంగలు’ సినిమాలో ‘శ్రీ వేంకటేశా..’ అనే గీతాన్ని ఆలపించిన లతా మంగేష్కర్ చివరి సారిగా 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు.


2009లో వచ్చిన ‘జైల్’ సినిమాలోని ‘డాటా సున్ లే’ అనే పాటతో తన సినీ సింగింగ్ కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టేశారామె. ఆ తర్వాత అన్నీ భక్తి పాటలే పాడారు. 2010 నుంచి వచ్చిన పాటల్లో వినదగ్గ సాహిత్యం లేదని, పైగా బూతు పాటలు ఎక్కువవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను సినిమాలకు పాటలు పాడటం ఆపేశానని తెలిపారు.


ఇక అవార్డుల విషయానికొస్తే.. భారత ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే, పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో లతాజీను సత్కరించింది. మరెన్నో ఇతర అవార్డులు ఆమెను వరించాయి.