నెగిటివ్‌గా చూపించారు.. గుంజన్ సక్సేనా సినిమాపై సెన్సార్ బోర్డుకు ఎయిర్ ఫోర్స్ ఫిర్యాదు..

  • Published By: naveen ,Published On : August 13, 2020 / 09:32 AM IST
నెగిటివ్‌గా చూపించారు.. గుంజన్ సక్సేనా సినిమాపై సెన్సార్ బోర్డుకు ఎయిర్ ఫోర్స్ ఫిర్యాదు..

జాన్వి కపూర్ నటించిన చిత్రం ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’ వివాదానికి దారి తీసింది. ఈ సినిమాపై ఎయిర్ ఫోర్స్ ఫిర్యాదు చేసింది. గుంజన్ సక్సేనా మూవీ బుధవారం(ఆగస్టు 12,2020) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. కాగా, ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను ‘ప్రతికూలంగా చిత్రీకరించారు’ అంటూ భారత వైమానిక దళం.. ఫిల్మ్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది.

భారతీయ వైమానిక దళం (ఐఏఎఫ్) కు ఆధారాలు అందజేస్తామని ధర్మ ప్రొడక్షన్స్ అంగీకరించిందని, ఈ చిత్రం తరువాతి తరం వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని సెన్సార్ బోర్డుతో పాటు నెట్‌ఫ్లిక్స్, ధర్మ ప్రొడక్షన్స్‌కు పంపిన లేఖలో వైమానిక దళం ఆరోపించింది. అయితే, ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలైన సమయంలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, సంభాషణలు వీక్షించడానికి పంపిన సమయంలో భారత వైమానిక దళాన్ని ప్రతికూలంగా చిత్రీకరించినట్లు గుర్తించినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్పారు.

‘మాజీ ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా పాత్రను కీర్తింపజేయడానికి మెస్సర్స్ ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రంలోని కొన్ని సంఘటనలను మార్చివేసిందని, ఇవి తప్పుదారి పట్టించడమే కాకుండా భారత వైమానిక దళం యొక్క పని సంస్కృతికి ముఖ్యంగా మహిళలకు అనుచితమైనవిగా, వ్యతిరేకంగా చూపిస్తోంది’ అని తన లేఖలో తెలిపింది.

ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం 1999 లో కార్గిల్ యుద్ధంలో భాగమైన భారత వైమానిక దళానికి చెందిన మొదటి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా చేసిన పోరాటం ఆధారంగా రూపొందించబడింది. కార్గిల్ యుద్ధంలో గాయపడిన సైనికులను రక్షించడంలో యుద్ధంలో ప్రయాణించిన మొదటి మహిళా పైలట్లలో సక్సేనా కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత పోరాటంలో ధైర్యం చూపించినందుకు ఆమెకు శౌర్యవీర్ అవార్డు ప్రదానం చేశారు.