నన్ను బెదిరిస్తున్నారు.. పోలీసులకు ఇళయరాజా ఫిర్యాదు..
ప్రసాద్ స్టూడియోస్ వ్యవస్థాపకులు ఎల్.వి.ప్రసాద్ ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజాపై గౌరవంతో వారి స్టూడియోలో ఓ ప్రత్యేకమైన గదిని రాజాకు కానుకగా ఇచ్చారు.
ఈ రికార్డింగ్ స్టూడియోలో ఇళయరాజా నాలుగు దశాబ్దాలుగా సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఎల్.వి.ప్రసాద్ తనయుడు రమేశ్ ప్రసాద్ ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ మనవడు సాయి ప్రసాద్ మాత్రం స్టూడియో స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ గతకొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తనను బెదిరిస్తున్నారంటూ ఇళయరాజా సాయి ప్రసాద్పై మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టూడియోలోని తన గదిలోకి సాయి ప్రసాద్ మనుషులు ప్రవేశించి సంగీత వాయిద్యాలు ఇతర పరికరాలు ధ్వంసం చేశారని, కోర్టులో కేసు నడుస్తుండగా దౌర్జన్యానికి పాల్పడ్డారని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఇళయరాజా మేనేజర్ జాఫర్ చెన్నై కమీషనర్కు కంప్లైంట్ చేశారు.