ధోని బయోపిక్‌ సినిమాలో అక్షయ్ కుమార్ ను కాదని సుశాంత్ ను తీసుకున్నా : దర్శకుడు నీరజ్‌ పాండే

  • Published By: bheemraj ,Published On : June 20, 2020 / 06:54 PM IST
ధోని బయోపిక్‌ సినిమాలో అక్షయ్ కుమార్ ను కాదని సుశాంత్ ను తీసుకున్నా : దర్శకుడు నీరజ్‌ పాండే

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్‌ జూన్ 14న ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ధోని బయోపిక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. భారత మాజీ క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్‌ ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర కోసం తనను తీసుకోవాల్సిందిగా అక్షయ్‌ కుమార్‌ ఆ చిత్ర దర్శకుడు నీరజ్‌ పాండేను కోరినట్లు సమాచారం. 

ఈ క్రమంలో 2017లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘నీరజ్‌ పాండే ధోని బయోపిక్‌ తెరకెక్కిస్తున్నారని నాకు తెలిసింది. దాంతో ఆ చిత్రంలో ధోని పాత్ర కోసం నన్ను తీసుకోవాల్సిందిగా నీరజ్‌ను కోరాను. కానీ అతడు సున్నితంగా తిరస్కరించాడు’ అని తెలిపారు. ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ధోని పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందింది.

దీనిపై నీరజ్‌ పాండే స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలో ధోని యుక్తవయస్సులో వచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి. 16-17 ఏళ్ల యువకుడిగా నటించాల్సి ఉంటుంది. ఆ వెర్షన్‌ అక్షయ్‌కు సూట్‌ కాదు. అందుకే అతడి అభ్యర్థనను తిరస్కరించాను’ అన్నాడు. అంతేకాక ఈ చిత్రంలో సుశాంత్‌ నటన గురించి మాట్లాడుతూ.. ‘తను చాలా మంచి నటుడు. ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు సుశాంత్‌ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివాడు. ధోని బాడీ లాంగ్వేజ్‌ను ఎంతో బాగా అనుకరించాడు’ అని తెలిపారు. ‘ఎమ్‌ఎస్‌ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 133 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుశాంత్ నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు.