జాన్వీ షూటింగ్ ను అడ్డుకున్న రైతులు

జాన్వీ షూటింగ్ ను అడ్డుకున్న రైతులు

Janhvi Kapoor Shooting : ప్ర‌ముఖ నిర్మాత బోని క‌పూర్, దివంగ‌త న‌టి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ క‌పూర్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. వైవిధ్య పాత్రలు చేసేందుకు ఈమె ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ జాన్వీ గుడ్ లఖ్ జెర్రీ అనే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో మంచి విజయం సాధించిన కోలమావు కోయిల రీమెక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. పంజాబ్ రాష్ట్రంలోని బస్సీ పఠానా ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతోంది.

షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి రైతులు చేరుకుని అడ్డుకున్నారు. తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలంటూ..కొంతమంది రైతులు డిమాండ్ చేశారు. శాంతియుతంగా వారు నిరసన తెలిపారు. దీంతో కొన్ని గంటల పాటు షూటింగ్ నిలిచిపోయింది. జాన్వీ కపూర్ మీడియా ముందుకు వచ్చి..తాను రైతులకు మద్దతుగా ఉంటానని ప్రకటించాలని వారు స్పష్టం చేశారు. జాన్వీతో ప్రకటన ఇప్పిస్తామని చిత్ర యూనిట్ చెప్పడంతో రైతులు శాంతించారు.

అనంతరం సోషల్ మీడియాలో జాన్వీ ఓ ప్రకటన విడుదల చేసింది. రైతన్నలు దేశానికి గుండెకాయ వంటి వారని, ఆహారాన్ని అందించడంలో వారి పాత్రను తాను గుర్తిస్తానన్నారు. సాధ్యమైనంత త్వరలోనే రైతులకు లబ్ది కలిగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. సైరాట్ రీమేక్ ద‌ఢ‌క్‌తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ ముద్దుగుమ్మ. ప్ర‌ముఖ మ‌హిళా పైలెట్ గుంజ‌న్ సక్సేనా జీవిత చ‌రిత్ర‌లో న‌టించింది. గ‌తేడాది ఓటీటీలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.