అరెరే అచ్చం అలాగే: మేడమ్ టుస్సాడ్స్లో చందమామ
కాజల్ అగర్వాల్… వెండితెర చందమామ.. తెలుగు సినిమాల్లో చందమామ సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు.. ఈ అందమైన చందమామ ఇప్పుడు మేడమ్ టుస్సాడ్స్లో కొలువు తీరింది. ఈ అరుదైన ఘనత దక్కించుకున్న తొలి సౌతిండియా హీరోయిన్ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్బాబు, డార్లింగ్ ప్రభాస్ సరసన చందమామ విగ్రహం కూడా చేరడంతో ఆమె అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
సింగపూర్లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరగా.. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్.. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దక్షిణాదిన హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్లో కొలువు తీరడం విశేషం.
ఇప్పటివరకు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ విగ్రహాలు అక్కడ కొలువుతీరి ఉన్నాయి. కొత్తగా కొలువుతీరిన చందమామ కాజల్ అగర్వాల్ విగ్రహం చూస్తుంటే.. అచ్చం నిజమైన కాజల్ అగర్వాల్ ని చూస్తున్నట్లే ఉంది. ఇక కాజల్ ప్రస్తుతం తెలుగులో మంచు విష్ణుతో ఓ సినిమా.. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న భారతీయుడు2 సినిమాలో నటిస్తోంది.