ప్రముఖ హీరో, అతని భార్యకు కరోనా పాజిటివ్..
సినీ ప్రముఖులను కరోనా వెంటాడుతోంది. సెలబ్రిటీలనే వదలడం లేదు, సామాన్యులు మీరెంత? అన్నట్టు ప్రజలను హెచ్చరిస్తోంది మహమ్మారి. తాజాగా.. కన్నడ సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేగింది. ప్రముఖ కన్నడ నటుడు ధృవ్ సర్జాకు, అతని భార్య ప్రేరణకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ధృవ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.
తనకు, తన భార్యకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్లు చేయించుకున్నామని.. ఇద్దరికీ పాజిటివ్గా నిర్ధారణ అయిందని ధృవ్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. తాము క్షేమంగా తిరిగొస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. గత కొద్దిరోజులుగా తమను కలిసిన వారు, సన్నిహితంగా మెలిగిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని ధృవ్ సూచించాడు.
జూన్లో గుండెపోటుతో మరణించిన నటుడు చిరంజీవి సర్జాకు ధృవ్ తమ్ముడు కావడం గమనార్హం. వీరు యాక్షన్ కింగ్ అర్జున్ సోదరి కొడుకులు. ఇదిలా ఉంటే.. సినీ పరిశ్రమలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిస్తున్నాయి. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, ఆయన కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యారాయ్, మనవరాలు ఆరాధ్య కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. వీరితో పాటు మరికొందరు సినీ మరియు టీవీ నటులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.