మా భూములకు నష్ట పరిహారం ఇప్పించండి.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కృష్ణంరాజు, అశ్వనీదత్..
Krishnam Raju – Ashwini Dutt: కేంద్ర మాజీ సహాయ మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు, ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధాని అభివృద్ధిలో భాగంగా గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణకు ఇచ్చిన భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని… ప్రభుత్వం వాటికి తగిన నష్ట పరిహారం చెల్లించాలని వారు పిటిషన్లు దాఖలు చేశారు.
కృష్ణంరాజు పిటిషన్..
గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు అప్పటి ప్రభుత్వం తన 31 ఎకరాల భూమిని తీసుకుందని కృష్ణంరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇంతలోనే మరో ప్రభుత్వం అధికారంలోకి రావడం.. రాజధాని తరలింపుకు సిద్ధమైన నేపథ్యంలో.. నష్టపరిహారం చెల్లింపుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు..
అశ్వనీదత్ పిటిషన్..
గన్నవరం ఎయిర్పోర్టు విస్తరణ కోసం తనకు చెందిన 39 ఎకరాల భూమిని కూడా అప్పటి ప్రభుత్వం తీసుకుందని అశ్వనీదత్ పిటిషన్లో పేర్కొన్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎకరా రూ.1కోటి 54లక్షలు ఉంటుందని… దానికి సరిసమానమైన భూమిని అమరావతిలో ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.
కానీ ఇప్పుడు రాజధాని తరలింపుతో అక్కడ విలువ పడిపోయిందని… కాబట్టి తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మొత్తం రూ.210కోట్లు ప్రభుత్వం తనకు పరిహారంగా చెల్లించాలన్నారు. ఇరువురి పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు… కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.