వీడని ‘మా’ వివాదాలు: కుర్చీ దిగని శివాజీ రాజా

  • Published By: vamsi ,Published On : March 16, 2019 / 02:18 PM IST
వీడని ‘మా’ వివాదాలు: కుర్చీ దిగని శివాజీ రాజా

మూవీ ఆర్టిస్ట్‌ ఆసోషియేషన్ ఎన్నికలు అనేక వివాదాల అనంతరం పూర్తి కాగా.. ఎన్నికల్లో సీనియర్ హీరో నరేష్ ప్యానెల్ గెలిచింది. అయితే ఎన్నికలు అయినా కూడా శివాజీరాజా, నరేష్‌ల మధ్య మొదలైన వివాదం తగ్గట్లేదు. నరేష్‌ వర్గం మార్చి 22వ తేదీన బాధ్యతలు స్వీకరించేందుకు ముహూర్తం నిర్ణయించుకుంది. అయితే శివాజీ రాజా మాత్రం.. తమకు మార్చి 31 వరకు గడువు ఉందని కోర్టు వెళ్తామన్నారని నరేష్‌ వెల్లడించారు. అంతేకాదు పెండింగ్‌లో ఉన్న చెక్కుల మీద సంతకాలు పెట్టేందుకు కూడా పూర్వ సభ్యులు సహకరించట్లేదు.

శివాజీరాజా వర్గంపై నరేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు కుర్చీ పిచ్చి లేదని, అయితే ఎన్నికల సమయంలో శివాజీ రాజా వ్యవహరించిన తీరుపైన మాత్రం అభ్యంతరాలు ఉన్నాయని అన్నారు. ఎన్నికల ముందు ‘మా’ సభ్యులను శివాజీ వర్గం ఎత్తుకెళ్లిందని ఆరోపించారు. చట్టపరంగా ఎన్నికల్లో గెలిచిన తరువాత ఎప్పుడైనా బాద్యతలు స్వీకరించే హక్కు మాకు ఉందని, పెద్దలతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ‘మా’ కోసం పనిచేయడానికి వచ్చిన తమకు అడ్డంకులు సృష్టించవద్దని నరేష్ కోరారు.