తెలుగు సినిమా సత్తా: ‘మహానటి’కి మరో అరుదైన గౌరవం

  • Published By: vamsi ,Published On : May 4, 2019 / 03:13 AM IST
తెలుగు సినిమా సత్తా: ‘మహానటి’కి మరో అరుదైన గౌరవం

వెండితెర సామ్రాజ్ఞి, భారతీయ సినిమాలలో తన సత్తా చాటుకున్న అభినేత్రి ‘సావిత్రి’ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’. ఈ సినిమా 2018లో విడుదలై సూపర్ హిట్ అవగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 2018 నేషనల్ అవర్డుల్లో సత్తా చాటే అవకాశం ఉంది అని ఇప్పటికే పలు విశ్లేషణలు వినిపిస్తుండగా.. ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.

ఇంట‌ర్నేష‌న‌ల్ ప‌నోర‌మ‌ విభాగంలో ఏకైక భార‌తీయ చిత్రంగా 22వ షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ (SIFF)కు ఈ సినిమా ఎంపికైంది. ఈ వేడుక‌ల్లో భాగంగా మెయిన్ లాండ్ చైనాలో ఈ సినిమా ప్రీమియ‌ర్‌ షో వేయనున్నారు.

2018 మే 9న విడుద‌లైన ఈ సినిమా 18 కోట్ల బిజినెస్ చేస్తే.. 45 కోట్ల‌కు పైగా షేర్ సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. కీర్తిసురేష్ మ‌హాన‌టి టైటిల్ పాత్ర‌లో న‌టించగా దుల్క‌ర్ స‌ల్మాన్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండ స‌హా ద‌క్షిణాదిలో పలువురు స్టార్ హీరోలు ఈ సినిమాలో న‌టించారు.

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజ‌యంతీ మూవీస్‌, స్వ‌ప్న సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి.  ప్ర‌ఖ్యాత IMDB జాబితాలో 2018కి గానూ Top10 లిస్ట్‌లో కూడా ఈ సినిమా Top-4గా నిలిచింది.