ముగ్గురిని కాదు ప్రతీ ఒక్కరు ముప్పై మందిని కదిలించాలి..

  • Published By: sekhar ,Published On : August 10, 2020 / 11:34 AM IST
ముగ్గురిని కాదు ప్రతీ ఒక్కరు ముప్పై మందిని కదిలించాలి..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన జన్మదినం పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఫిలింనగర్‌లోని తన నివాసంలో మొక్కలు నాటారు.



అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకి ఎంతుందో.. మొక్కలకి, జంతువులకి కూడా అంతే ఉంది. అన్ని జీవ జాలాన్ని సమానంగా చూడటమే నాగరికత అన్నారు పెద్దలు, కానీ మనం మాత్రం బంగళాలు కట్టడం, అడవుల్ని నరికి భూమిని నిస్సారం చేసే ఎరువుల్ని వాడి అభివృద్ధి, నాగరికత అనుకుంటున్నాం. అందుకే ఇన్ని విపత్తులు సంభవిస్తున్నాయి. నా దృష్టిలో నిజమైన అభివృద్ధి అంటే మనుషులతో పాటే వృక్షాల ఎదుగుదల కూడా. అప్పుడే మనం విపత్తులు లేకుండా, కరోనాలాంటి మహమ్మారులు లేకుండా నిశ్చింతంగా బ్రతకగలం.



Mahesh Babu ఇది జరగాలంటే ప్రతీ ఒక్కరు మన జోగినిపల్లి సంతోష్ కుమార్‌ గారు ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొనాలి, బాధ్యతగా మూడు మొక్కలు నాటాలి. ముగ్గురిని కాదు ప్రతీ ఒక్కరు ముప్పైమందిని కదిలించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.



ఇది ఛాలెంజ్ అనేకంటే భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఇంకా బావుంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే నాదీ, నీది అని కుచించుకుపోయిన సమాజంలో ఇంత ఉదాత్తమైన కార్యక్రమాన్ని తీసుకొని ఇంతమందిని కదిలించడం అంటే మాములు విషయం కాదు. అందుకు సంతోష్ కుమార్‌ గారిని మనసారా అభినందిస్తున్నా. వారి కృషికి మద్దతుగా నా అభిమానులందరు ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ స్వీకరించి మొక్కలు నాటాలని కోరుతున్నాను. అలాగే ఈ చైన్‌ను కంటిన్యూ చేస్తూ తారక్, విజయ్ సార్(తమిళ స్టార్ హీరో), శృతి హాసన్‌లు ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను..’’ అని తెలిపారు.