కాలర్ ఎగరేస్తున్నా.. వారంలో రికార్డులు తిరగేస్తా
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ తొలి 3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.40కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. పూజా హెడ్గే హీరోయిన్గా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించిన మహర్షి సినిమా సూపర్హిట్ కావడంతో ఆదివారం(12 మే 2019) సక్సెస్ మీట్ను ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ బాబు.. ‘‘ఈ రోజు చాలా స్పెషల్ డే.. మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడుతో సమానం. ఏ సినిమా రిలీజ్ అవుతున్నా ముందు అమ్మ దగ్గరకు వెళ్లి కాఫీ తాగుతాను. అలా కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తిన్నట్లు ఉంటుంది. ఆవిడ ఆశీస్సులు నాకు చాలా ముఖ్యం. ‘మహర్షి’ విజయాన్ని అందరు అమ్మలకు అంకితం ఇస్తున్నాను.” అని అన్నారు.
అలాగే “మూడు పెద్ద బ్యానర్లలో చేయడం ఆనందంగా ఉంది. నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ను వన్ వీక్లో దాటబోతున్నాను. దీనికి మించిన ఆనందం నాకు లేదు. ఆడియన్స్, నా అభిమానులకు హ్యాట్సాఫ్. ముందుగా నరేష్గారికి థాంక్స్.. ఎందుకంటే, ఆయన ఈ క్యారెక్టర్ను చేస్తాడా? అనుకున్నాను. ఒప్పుకున్నందుకు థ్యాంక్స్. ఇక దర్శకుడు వంశీ.. నా అభిమానులు, నాన్నగారి అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగేలా చేస్తారని ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడని, ఇప్పుడు నేను కూడా కాలర్ ఎగరేస్తున్నా” అంటూ కాలర్ ఎగరేశారు.