నచ్చినోన్ని ప్రేమించడం తప్పా.. నా ప్రేమకు నా నాన్నే ముప్పా?..
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ పరువు హత్య.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆధారంగా చేసుకుని ‘మర్డర్’ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాకు సంబంధించిన ఇది వరకు తండ్రి కోణంలో సాగే ‘పిల్లల్ని ప్రేమించడం తప్పా?..’ అనే పాటను విడుదల చేసిన వర్మ కూతురు కోణంలో సాగే ‘నచ్చినోన్ని ప్రేమించడం తప్పా..?’ అనే పాటను విడుదల చేశారు. వర్మ ఆస్థానకవి సిరా శ్రీ లిరిక్స్ రాయగా, దివ్య ఐశ్వర్య పాడారు.
ఈ సినిమా విడుదలను ఆపాలంటూ అమృత, ప్రణయ్ తండ్రి ఇప్పటికే కోర్టులో కేసు వేశారు. దానికి సంబంధించిన ఇంకా తీర్పు వెలువడలేదు. మరోసారి వాస్తవ సంఘటన ఆధారంగా సినిమా తీస్తూ తనక్కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీ రాబట్టుకుంటున్నాడు ఆర్జీవీ. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా ‘మర్డర్’ విడుదల కానుంది.