కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన పాయల్‌ ఘోష్‌

  • Published By: sekhar ,Published On : October 7, 2020 / 08:38 PM IST
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన పాయల్‌ ఘోష్‌

MeToo – Payal Ghosh: అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనానికి తెర తీసిన నటి పాయల్‌ ఘోష్‌ మంగళవారం రోజున జాతీయ మహిళా కమీషన్‌ను పాయల్‌ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆమె ఒంటరిగానే తన సమస్యను ప్రభుత్వానికి చేరవేసే దిశగా బలమైన ప్రయత్నాలు చేస్తోంది. కాగా బుధవారం రోజున కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కలిసింది పాయల్. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది.


తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయనకు లేఖను సమర్పించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగారిని కలిసి మాట్లాడానని, తనకు న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నానని ఆమె తెలిపింది. మరోవైపు పాయల్‌ లైంగిక ఆరోపణల్లో ఇతర హీరోయిన్స్‌ హూమా ఖురేషి, రిచా చద్దా, మహీగిల్‌ పేర్లను కూడా ప్రస్తావించింది. హూమా ఖురేషి, మహీగిల్‌ ఈ ఆరోపణలపై తమదైన శైలిలో స్పందించి ఊరుకున్నారు.


కానీ.. రిచా చద్దా మాత్రం తన పరువుకు భంగం కలిగించిందని పేర్కొంటూ పాయల్‌పై పరువు నష్టం కేసు వేసింది. రూ.1.1 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని నోటీసు జారీ చేసింది. ఆ కేసు గురించి పాయల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించింది కూడా. క్షమాపణలు చెబితేనే కేసు విత్‌ డ్రా చేసుకుంటానని చెప్పినప్పటికీ తానెవరికీ సారీ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది.